హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ) : నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిరుద్యోగుల జేఏసీ హెచ్చరించింది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడింది. ‘రేవంత్ డౌన్డౌన్’, ‘నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంగళవారం దిల్సుఖ్నగర్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెంటనే 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్స్, ఏజెన్సీ డీఎస్సీ, కేజీబీవీ టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులపై ప్రభావం పడుతున్నా పోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని విమర్శించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేశ్ మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మండిపడ్డారు.