వేలేరు, ఏప్రిల్ 11 : అవకాశవాదానికి, నమ్మక ద్రోహానికి కేరాఫ్ అడ్రస్ కడియం శ్రీహరి అని, తన వ్యక్తి గత రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్లో చేరాడని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. శనివారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొయ్యడ మహేందర్ నేతృత్వంలో జరిగిన పార్టీ కార్యకర్తలు, బూత్ లెవల్ ఇన్చార్జిల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి దళితుడు కాదని, పద్మశాలి కులంలో పుట్టి బైండ్ల కులానికి చెందిన వ్యక్తి దగ్గర పెరిగారని వివరించారు.
టీడీపీ పార్టీలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని విమర్శించారు. కడియంకు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ సీఎం కేసీఆరేనని, బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి, బ్లాక్మెయిల్తో తన బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్కు కడియం శ్రీహరి నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్లో చేరాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి దొంగ, బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్కు ద్రోహం చేసిన కడియం దొంగగా మారారని రాజయ్య వివరించారు.
కడియం శ్రీహరితో ఉన్నోళ్లు నకిలీ కాంగ్రెస్ కార్యకర్తలని, ఇందిరతో ఉన్నోళ్లే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలన్నారు. కాంగ్రెస్ జెండా కప్పుకున్న కడియం ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకు తానింకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పీకర్కు అఫిడవిట్ సమర్పించడం సిగ్గుచేటన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
నియోజకవర్గంలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వంలో రూ.104 కోట్లతో పనులు ప్రారంభిస్తే సాగునీటి పనులను పూర్తి చేసే దమ్ము కడియంకు లేదని విమర్శించారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఆనంతరం బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు ఆకుల కుమార్, వేలేరు మండల ఇన్చార్జి భూపతిరాజ్, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, ధర్మసాగర్ మండల ఇన్చార్జి కర్ర సొమిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, నాయకులు నర్సింహరావు, సూత్రపు సంపత్, ఇట్టబోయిన సంపత్ తదితరులు పాల్గొన్నారు.