రామగిరి, ఆగస్టు 11: తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడ్డారని ఎమ్మార్పీఎస్-టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా తెలిపారు. 32 ఏండ్ల రిజర్వేషన్ పోరాటం పూర్తయినందున ఇకపై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి ఎస్సీ వర్గీకరణ ద్వారా 9% రిజర్వేషన్లు సాధించామని, ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేసున్నట్టు తెలిపారు. రాజ్యాధికారం లేని కులాలు చరిత్రలో అంతరించిపోతాయనే మహనీయుల మాటల స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు దీటుగా మాదిగల హకుల కోసం పోరాటాలు సాగిస్తామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నకిరేకంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం ; రిజర్వేషన్లు 22 శాతానికి పెంచాలి: మాల సంఘాలు
హైదరాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని, దీనివల్ల విద్యా, ఉద్యోగ, ప్రమోషన్ల రంగాల్లో మాల సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని మాల సంఘాల నాయకులు చెరుకు రామచందర్, గోపు రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు. వర్గీకరణపై పలువురు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి మంగళవారం వినతిపత్రాలు సమర్పించినట్టు చెప్పారు. దళితుల రిజర్వేషన్లను 22 శాతానికి పెంచాలని, రోస్టర్ విధానాన్ని సవరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.