హనుమకొండ, మార్చి 31: కడియం శ్రీహరివి ఊసరవెల్లి రాజకీయాలని, మాదిగలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా, రాహుల్ గాంధీ నుంచి సీఎం రేవంత్రెడ్డి వరకు మాదిగల ఓట్లు అడిగే హక్కును కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు స్థానం లేదనేది తేటతెల్లం మైందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఎస్సీ కాలనీ ల్లోకి రాకుండా గోబ్యాక్ అంటూ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధిక శాతం మాదిగలు ఉన్న నాగర్కర్నూల్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను మాలలకు కేటాయించారన్నారు. అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని సైతం బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోగానే బైండ్ల కులస్తులైన కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని గొప్పలు చెప్పుకొనే కడియం ఎంత స్వార్థపరుడో అర్థమైందని అన్నారు.
మాదిగల సహకారంతో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉపముఖ్య మంత్రి వరకు ఎదిగిన కడియంను చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీలోని తాటికొండ రాజయ్య, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, అరూరి రమేశ్కు అన్యాయం చేసారని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూలిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కడియం రాత్రి రాత్రే ప్లేట్ పిరాయించి మాదిగ లకు వస్తుందనుకున్న వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని తన కూతురు కడియం కావ్యకు ఇప్పించుకొని మరో ద్రోహం చేశారని అన్నారు. రేవంత్రెడ్డి తలుచుకొంటే దొమ్మాటి సాంబయ్య, ఇందిరకు గాని వరంగల్ ఎంపీ స్థానం దక్కేదని అన్నారు. బీజేపీ మాదిగలకు రెండు ఎంపీ స్థానాలు కేటాయించందని తెలిపారు. సమావే శంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ, ఎమ్మెస్పీ జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్ను దినేష్ మాదిగ, ఎమ్మెస్పీ నాయకులు మంద రాజు మాదిగ, శంకర్ మాదిగ, చేతల రమేశ్ మాదిగ, గంగారపు శ్రీనివాస్ మాదిగ, రేణుకుంట్ల మహేశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు పాల్గొన్నారు.