PM Modi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leak) వ్యవహారంపై ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆయన పిలుపునిచ్చారు. పేపర్ లీక్లను నిరోధించడం జాతీయ బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇవాళ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్ (Mangal Milan)’ సమావేశం అనంతరం కేంద్రమంత్రి (Union Minister) కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేని పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరినట్లు రిజిజు తెలిపారు. చట్టసభల్లో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ఉండాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా పార్లమెంటులో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం విషయంలో ఎంపీలు అందరిపైనా ఉమ్మడి బాధ్యత ఉందని మోదీ అన్నట్లు రిజిజు తెలిపారు.
నీట్ కుంభకోణంపై విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిన్న పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వందలాది మంది విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ‘బొద్దింకలతో’ పోల్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.
నీట్ పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, నిందితుల అరెస్టులకు దారితీసిందని ప్రధాని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే తిరిగి పరీక్ష నిర్వహించామని మోదీ చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఉద్యమానికి మద్దతుగా 21 రోజులపాటు నిరాహారదీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై పోలీసుల దమనకాండను చూసిన ఆయన.. ఆసుపత్రి నుంచే తన దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.
ఇదిలావుంటే తమను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, కేంద్రమంత్రి జేపీ నడ్డాతో తమ నేతలు సమావేశమై డిమాండ్లతో కూడిన లేఖను సమర్పించారని సీజేపీ తెలిపింది. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని అంగీకరించిన నడ్డా చర్చల ప్రతిపాదన నిరసనకారుల నుంచే వచ్చిందని స్పష్టంచేశారు.