Suriya vs Nayanthara | తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనుంది. గతంలో ‘గజిని’, ‘ఆధవన్’, ‘మాస్సు ఎంగిర మసిలామణి’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన స్టార్ హీరో సూర్య, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఒకరికి ఒకరు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు.సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మరియు నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘హాయ్ ‘ చిత్రాలు రెండూ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో స్వాతంత్య్ర దినోత్సవ సెలవులను లక్ష్యంగా చేసుకుని ఈ రెండు సినిమాలు నేరుగా పోటీ పడనున్నాయి.
మొదట ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అనంతరం నయనతార నటించిన ‘హాయ్’ మూవీ మేకర్స్ కూడా అదే తేదీని రిలీజ్ డేట్గా ప్రకటించడంతో బాక్సాఫీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ‘హాయ్’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విష్ణు ఏడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కవిన్ హీరోగా నటిస్తుండగా, కె. భాగ్యరాజ్, రాధికా శరత్కుమార్, ప్రభు, వీటీవీ గణేష్, సత్యన్, అమృత శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరోవైపు ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో కూడిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఒకవైపు ఫ్యామిలీ డ్రామాతో సూర్య, మరోవైపు రొమాంటిక్ కామెడీతో నయనతార ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్లో తమిళ సినీ పరిశ్రమలో ఈ క్లాష్ హాట్ టాపిక్గా మారింది.