Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
మొగుళ్లపల్లికి చెందిన బండారి అఖిల్, రంగాపురం గ్రామానికి చెందిన ఉస్కుల హర్షవర్దన్ ఇద్దరూ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం వీరిద్దరూ స్కూల్కు బయల్దేరారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా పాఠశాలకు బయల్దేరి వెళ్లారు. కానీ పాఠశాలకు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టాలని అనుకున్నారు. దీంతో కొరికిశాల శివారులోకి వెళ్లి కాసేపు గడిపారు. పెద్దవాగు శివారులోని కల్లు మండువాలో సేదతీరినట్లు అక్కడి గీత కార్మికులు తెలిపారు. స్కూల్ విడిచిపెట్టే టైమ్ కావడంతో ఐదుగురు స్నేహితులు ఇంటికి వెళ్లిపోయారు. కానీ అఖిల్, హర్షవర్దన్ మాత్రం సాయంత్రం అయినా ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన వాళ్ల తల్లిదండ్రులు స్నేహితులను ఆరా తీశారు. చుట్టుపక్కల అంతా వెతగ్గా.. కొరికిశాల శివారులోని వాగులో అఖిల్, హర్షవర్దన్ బ్యాగులు కనిపించాయి. దీంతో వాళ్లిద్దరూ ఈత కోసం వాగులో దిగి ఉంటారని అనుమానించి సోమవారం రాత్రే గాలింపు చర్యలు మొదలుపెట్టగా వాళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.