జయశంకర్ భూపాలపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) పేర్కొన్నారు. జిల్లాలోని మంథని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా పోటీచేస్తున్న పుట్ట మధు గెలిస్తే నియోజకవర్గానికి రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించినందున నియోజకవర్గాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నట్లేనని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెరగనున్నాయని, రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ. 5 లక్షల బీమా అందనుంని తెలిపారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 15 లక్షలకు పెంచనుందని తెలిపారు. మంథని నియోజకవర్గాన్ని పుట్ట మధు బుల్లెట్ వేగంతో అభివృద్ధి చేయడం వల్ల ఆయనకు బుల్లెట్ మధుగా పేరు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి కరెంటు పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను బేరిజు వేసుకోవాలని ఆమె కోరారు. పుట్ట మధును గెలిపించుకుంటే కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కవిత వెల్లడించారు.