కేసీఆర్ పాలనకు మేధావుల మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండోసారి రాజేశ్వర్రెడ్డి గెలుపు
ఎలిమినేషన్ రౌండ్స్లో వరించిన విజయం
తొలి ప్రాధాన్యతా ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యం
రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న… ఆ తర్వాత కోదండరాం
బీజేపీ, కాంగ్రెస్లు నాలుగు, ఐదు స్థానాలకు పరిమితం
పెద్దగా ప్రభావం చూపని జయసారథి, చెరకు, రాణీరుద్రమ
స్వతంత్ర అభ్యర్థులకు నామమాత్ర ఓట్లు
90గంటల పాటు సుదీర్ఘంగా సాగిన లెక్కింపు ప్రక్రియ
నల్లగొండ ప్రతినిధి, మార్చి 20(నమస్తే తెలంగాణ) :ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు పట్టభద్రులు మరోసారి జైకొట్టారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి స్థానానికి టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన పల్లా రాజేశ్వర్రెడ్డిని రెండోసారి గెలిపించి తాము మీ వెంటే అంటూ మద్దతునిచ్చారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించి తదుపరి ప్రాధాన్యతా ఓట్లతో విజయం కట్టబెట్టారు. కుట్రలు, అసత్య ఆరోపణలతో ఓటర్లను గందరగోళంలో పడేయాలని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ సహా ఇతరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. మొత్తం 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ప్రాధాన్యతా ఓట్లు దక్కగా తీన్మార్ మల్లన్నను ద్వితీయ స్థానానికి పరిమితం చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్రెడ్డి వరుసగా రెండోసారి ఇక్కడినుంచి విజయం సాధించగా ఈ స్థానం ఏర్పడిన నాటి నుంచి నాలుగుసార్లు ఎన్నికలు జరుగగా అన్నిసార్లు గులాబీ జెండానే ఎగిరింది. ఇది టీఆర్ఎస్ కంచుకోట అని ఇక్కడి పట్టభద్రులు మరోసారి నిరూపించారు. ఏడు రౌండ్ల తొలి ప్రాధాన్యతా ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినా గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. ఎలిమినేషన్ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లలోనూ సత్తా చాటుతూ విజయం దిశగా అడుగులు వేశారు. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,87,969 ఓట్లు పోలవ్వగా వాటి లెక్కింపు ప్రక్రియను ఈ నెల 17వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నల్లగొండలోని ఆర్జాలబావి పరిధిలోని గోదాంలలో ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపును ఏడు రౌండ్లలో పూర్తి చేశారు. ఒక్కో రౌండ్లో 56వేల ఓట్లను లెక్కించగా ప్రతీ రౌండ్లోనూ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. మొత్తం 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్రెడ్డికి 1,10,840 తొలి ప్రాధాన్యతా ఓట్లు దక్కాయి. తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లతో ద్వితీయ స్థానంలో, కోదండరామ్ 70072 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి 39107ఓట్లు, కాంగ్రెస్ రాములునాయక్కు 27588ఓట్లు, సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డికి 9577, చెరుకు సుధాకర్కు 8631, రాణిరుద్రమకు 7756 ఓట్లు వచ్చాయి. వీరితో బరిలో ఉన్న ఇతర అభ్యర్ధులకు నామమాత్రపు ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ మొత్తం పోలైన ఓట్లలో 21636 చెల్లని ఓట్లు పోగా మిగిలిన 366333 చెల్లిన ఓట్లలోంచి సగానికి ఒకటి ఎక్కువ అంటే 183167ను గెలుపు కోటా నిర్ధారించారు.
ఎలిమినేషన్ రౌండ్స్లో పల్లా గెలుపు ఖరారు.
తొలి ప్రాధాన్యతలోనే పల్లా 27550 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నా… మొత్తం చెల్లిన ఓట్లలో సగం అయిన 183167 మేజిక్ ఫిగర్ను చేరుకునేందుకు చాలా దూరంలో ఉన్నారు. ఈ దశలో అధికార యంత్రాంగం ఎలిమినేషన్ పద్ధతిలో అభ్యర్థుల ముందుగా ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో ప్రారంభించి తదుపరి ప్రాధాన్యతల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టింది. ముందుగా అతి తక్కువ తొలి ప్రాధాన్యతా ఓట్లను పొందిన అభ్యర్థి నుంచి మొదలుపెట్టి చివరకు ఒక్కరు మిగిలే దాకా ఎలిమినేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం స్వతంత్రులైన 59మంది అభ్యర్థుల బ్యాలెట్లలో ఆయా అభ్యర్థులకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను లెక్కించినా ఫలితం దక్కలేదు. దీంతో ముందుగా రాణీరుద్రమను ఎలిమినేట్ చేశారు. తర్వాత వరుసగా చెరుకు సుధాకర్, జయసారథిరెడ్డి, రాములునాయక్, గుజ్జుల ప్రమేందర్రెడ్డి కూడా ఎలిమినేషన్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ పూర్తయ్యే సరికి పల్లాకు 1,32,921ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1,08,253 ఓట్లు, కోదండరామ్కు 1,03,030 ఓట్లు రాగా పల్లానే 24,668 ఓట్ల ఆధిక్యత కలిగి ఉన్నారు. ఈ క్రమంలో తృతీయ స్థానంలో ఉన్న కోదండరామ్ను ఎలిమినేట్ చేస్తూ ప్రాధాన్యతా ఓట్లను పంచారు. ఈ రౌండ్లో వచ్చిన తదుపరి ప్రాధాన్యతా ఓట్లతో పాటు అంతకుముందే ఉన్న స్పష్టమైన మెజార్టీ ఓట్లతో కలుపుకొని అత్యధిక ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను కూడా పరిగణలోకి తీసుకొని అందులో పల్లాకు వేసిన ఓట్లను కూడా లెక్కించారు. ఈ ప్రక్రియ అంతా అర్ధరాత్రి వరకు కొనసాగింది.
ప్రభుత్వ పాలనకు మద్దతుగా పట్టభద్రులు..
నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేసిన అసత్యారోపణలను తిప్పికొడుతూ పట్టభద్రులు టీఆర్ఎస్ పాలనకు పట్టంకట్టారు. తప్పడు అసంబద్ద ప్రచారాలతో ఓటర్లను గందరగోళానికి గురిచేయాలని చేసిన అన్ని ప్రయత్నాలు తిప్పికొడుతూ చెంపపెట్టు లాంటి తీర్పును పట్టభద్రులు ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడమే కాకుండా.. ఇప్పుడు ఆ రాష్ర్టాన్ని సమగ్రాభివృద్ది దిశగా పయనింపజేస్తున్న కేసీఆర్ సర్కార్ పాలనకు పట్టభద్రులు జై కొట్టినట్లుగానే ఈ విజయాన్ని భావిస్తున్నారు. పాత ఉమ్మడి మూడు జిల్లాలల్లోని పట్టభద్రులంతా దాదాపు ఒకేతీరుగా తమ తీర్పును ఇచ్చినట్లు కౌంటింగ్ సరళి వెల్లడిచేసింది. ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. ప్రతీ రౌండ్లోనూ 3700 నుంచి 4200 వరకు అధిక్యతను చేకూర్చారు. ఆరున్నరేళ్ల కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు.. అనేక పథకాల గురించి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లకు చేరవేయడంలో సఫలమయ్యారు.