భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గని కార్యాలయంలో కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు వంద మస్టర్లు చేయని గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఉద్యోగులు సరిగా విధులు నిర్వహించకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గడంతోపాటు , సింగరేణి సంస్థ నష్టపోవడమే కాకుండా సదరు కార్మిక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. ఈసందర్భంగా గైర్హాజరు కారణాలను కార్మికులను, వారి కుటుంబ సభ్యులను మేనేజర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బోడ శ్యామ్ప్రసాద్, టీబీజీకేఎస్ గని ఫిట్ సెక్రటరీ గాజే సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.