భూపాలపల్లి రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్యను కలిశారు. ఈ నెల 19న ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప హరిత హోటల్లో నిర్వహించనున్న జోనల్ కాన్ఫరెన్స్ 2021కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. స్పందించిన కలెక్టర్ కాన్ఫరెన్స్కు హారవుతానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలను అందించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు కృషి చేయాలని కోరారు.
అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ డోనేషన్ క్యాంపులను నిర్వహించి పేద ప్రజలకు రక్తాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఐఎంఏ జోనల్ కాన్ఫరెన్స్ 2021 బ్రోచర్ ను విడుదల చేశారు. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించినందుకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు శాలువతో కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ ఉపాధ్యక్షుడు, చైర్మన్ డాక్టర్ సందీప్, ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్, సభ్యులు డాక్టర్ కాళీప్రసాద్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.