మొగుళ్ల పల్లి, ఫిబ్రవరి 25 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కరెంటు కోతలతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి ఆన్నారు. గతంలో దాదాపు 18 గంటల కరెంటు ఇచ్చిన సమయంలో పంట పొలాలకు సాగునీరు అంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదన్నారు. ఇప్పుడు మాత్రం దాదాపు పది గంటలు మాత్రమే కరెంటు ఇవ్వడంతో సరియైన సాగునీరు అందక పంటలు ఎండుతుండడంతో పాటు తరచూ కోతలు పెడుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో కరెంటు వస్తుందని పంట పొలాల వద్దకు రైతులు నిద్రలేకుండా కరెంటు కోసం ఎప్పుడు వస్తుందో అంటూ ఎదురుచూడాల్సి పరిస్థితులు దాపురించాయన్నారు. ఇప్పటికైనా గతంలో మాదిరిగానే రాత్రి పది నుండి తెల్లవార్లు సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఏకకాలంలో 18 గంటల కరెంటు కోతలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.