జనగామ రూరల్, డిసెంబర్19: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కే రాము అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో జిల్లా విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా వికాసానికి ఉపాధ్యాయులు దోహదపడాలన్నారు. బోధనలో మెళకువలు పాటించాలని ఆయన సూచించారు. సమష్టి కృషితో పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని ఆయన కోరారు. ఈనెల 28న ప్రతి మండలంలో టీఎల్ఎం మేళాలు నిర్వహించాలని రాము సూచించారు. ఎఫ్ఎల్ఎన్-3లో బబుల్స్ ఆధారంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. ప్రణాళికబద్దంగా బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించేలా దృష్టి సారించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి బీ శ్రీనివాస్, కోర్సు కోఆర్డినేటర్ మల్లిఖార్జున్, డీసీఈబీ కార్యదర్శి చంద్రభాను, ఎంఈవో భగవాన్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గణితం టాలెంట్ టెస్ట్లో విజేతలకు బహుమతుల ప్రదానం
జనగామ రూరల్ : జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో సోమవారం మాథ్స్ టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజేతలైన విద్యార్థుల వివరాలను డీఈవో కే రాము వెల్లడించారు. ఇంగ్లిష్ మీడియంలో బాలబోయిన హరిత, మోడెం సాత్విక(జడ్పీహెచ్ఎస్ కూనూర్), మద్దెల లోకేశ్(జడ్పీహెచ్ఎస్ పల్లగుట్ట), తెలుగు మీడియంలో బొల్లం సాహితి, నామాల వైష్ణవి (జడ్పీహెచ్ఎస్ వడ్లకొండ), భూక్యా అభిల (జడ్పీహెచ్ఎస్ ధర్మాపురం) ఎంపికయ్యారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి కే రాము విజేతలైన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోలు రాజు, శ్రీనివాస్, నర్సింహారావు, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్, ఉపాధ్యక్షులు వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర్లు, అంకం రవీందర్, అనిత, కోశాధికారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.