కొడకండ్ల, ఆగస్టు 28 : జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామేశ్వరం శివారులో ఉన్న పోలకొండ.. రాష్ట్ర కూటులు, కాకతీయుల ఏలుబడిలో ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. 9వ శతాబ్దం ముందునుంచే ఈ ప్రాంతం విశిష్టతను కలిగి ఉన్నదని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. కాయతీయుల కాలంలో ప్రోలరాజు ఏలిన ఈ ప్రాంతంలో అనేక ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవులు నివసించారనేందుకు ఆధారంగా రాతి పనిముట్లు, బృహత్శిలా సమాధులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఇక్కడి ప్రకృతి రమణీయత విశేషంగా ఆకట్టుకుంటున్నది. గుట్టలు, వాటిని ఆనుకుని చెరువు, చుట్టూ పచ్చని పంట పొలాలు, గుంపుగా పెరిగిన తాటి, ఈత వనాలున్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నది. అంతేకాకుండా ఇక్కడ ట్రెక్కింగ్ చేసేందుకూ అనువుగా ఉంది.
ప్రోలరాజు పేరుమీదే..
కాకతీయ రాజైన ప్రోలరాజు పరిపాలనలో ఇక్కడి కొండపై శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఎత్తయిన రాతి గోడ, శివాలయం ఇప్పటికీ ఉన్నాయి. గుట్ట పరిధిలో గణపతి ఆలయం నేలమట్టం కాగా ఆపురూపమైన వినాయక విగ్రహం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. గుప్త నిధుల కోసం ఇక్కడి ఆలయాలను, విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. గుట్టపైన గుర్రపు రేవులు, చాకిరేవులు, ఒక్కో అంతస్తులో ఒక్కో ప్రహరీ నిర్మాణం ఇప్పటికీ కనిపిస్తాయి. నాడు ఉపయోగించిన మట్టి పాత్రలు, మారణాయుధాలు, దోషులను శిక్షించేందుకు ఉపయోగించిన బండరాళ్లు నేటికీ దర్శనమిస్తాయి. గుట్ట కింది భాగంలో పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పాటు చేసిన రాకాసి గూళ్లు (పురాతన సమాధులు) ఉన్నాయి. కొన్ని చోట్ల రైతులు భూములు దున్నడంతో కొన్ని సమాధులు కనుమరుగయ్యాయి. ప్రోలరాజు ఏలుబడి ఉన్న ప్రాంతం కాబట్టే ఈ కొండకు పోలకొండ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
జనగామ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్లు, మండలకేంద్రమైన కొడకండ్ల నుంచి 8కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ పోలకొండ గుట్ట ఉన్నది. 9వ శతాబ్దం ముందునుంచే ఈ ప్రాంతం చారిత్రక విశిష్టతను కలిగి ఉన్నదనేందుకు ఆధారాలున్నాయి. రాష్ర్టకూటులు పాలించిన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. గుహపై వేసిన వినాయకుడి బొమ్మ, రాతి పనిముట్లు, గుట్టపై ఉన్న కన్నడ శాసనం ప్రకారం 9వ శతాబ్దం ముందు నుంచే ఈ ప్రాంతం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ పేర్వారం జగన్నాథం, పురవస్తు పరిశోధకులు డాక్టర్ జయధీర్ తిరుమల్రావు, రెడ్డి రత్నాకర్రెడ్డి ఇటీవల పరిశోధనలు చేసి ఇక్కడి ఘన చరిత్రను మరింత వెలుగులోకి తెచ్చారు.
గుట్ట పరిసరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం
రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కొండ ప్రాంతంలోనే బృహత్ వనం కోసం అధికారులు స్థలాన్ని గుర్తించారు. దీంతో పాటే కొండను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకంగా బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
శ్రీరామనవమి రోజున జాతర
శ్రీ రాముడు సీతాన్వేషణలో భాగంగా పోలకొండ గుట్టపై ఉన్న గుహలో విశ్రాంతి తీసుకుని ఇటునుంచి జీడికల్వైపు వెళ్లినట్లుగా ఇక్కడివారి నమ్మకం, సీతను రావణాసురుడు అపహరించిన సమయంలో జింకను వదిలిన తీరులో శ్రీరామ నవమి రోజున గ్రామస్తులు గొర్రెపిల్లను వదిలి దాని వెంట పరుగెత్తి వేడుక నిర్వహిస్తారు.
ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు పుష్కలం
ఆదిమానవుల ఆనవాళ్లు, కాకతీయ రాజు ప్రోలరాజు ఏలిన ఆనవాళ్లు కలిగిన ప్రోలకొండను అభివృద్ధి చేయా లి. సుమారు 5కిలో మీటర్ల వైశాల్యం తో ఉన్న గుట్ట నలమూలలా పర్యాటకా నికి అనువైనదిగా ఉంది. గ్రామస్తులు శ్రీ రామనవమి రోజు ఉత్సవాలను గుట్టపైనే జరిపేవారు. వసతులు లేక గ్రామంలోనే చేస్తున్నారు.
అభివృద్ధి చేయాలి
ఎంతో చరిత్ర కలిగిన పోలకొండను పర్యాటకంగా తీర్చిదిద్దితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. టీఆర్ఎస్ సర్కారు చర్యలతో మా ఊరు ప్రగతి బాట పట్టింది. అదేవిధంగా మా పోల కొండ గుట్టను అభివృద్ధి చేయాలి. మా మండలానికి చెందిన బృహత్ పల్లె ప్రకృతి వనం కూడా ఇక్కడే ఏర్పాటు కాబోతున్నది.