ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఊడలు తిరిగిన మహావృక్షాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రికి ప్రతిరూపంగా చూసుకుంటున్నారు. దినదినం పెరుగుతూ వచ్చిన ఈ మర్రిచెట్టు కోసం 30 గుంటల భూమిని వదిలేసి, 32ఏళ్లుగా ఆ చెట్టునే ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. కాలక్రమంలో తండావాసులంతా ఆ వృక్షాన్ని ఇలవేల్పుగా భావిస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. దానిని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఆకులు, కొమ్మలు తెంపకుండా కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం 10గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ వృక్షరాజానికి దండం పెట్టి ఏ పని మొదలు పెట్టినా విజయవంతమవుతుందనే నమ్మకాన్ని పెట్టుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల తండాకు చెందిన బానోతు హరిచంద్రు-ధనమ్మకు ఇద్దరు కొడుకులు. వీరి పెద్ద కొడుకు బిచ్చ మధ్యవయస్కుడిగా ఉన్నప్పుడు చనిపోయాడు. దీంతో అతడిని తమ చెలకలోనే ఖననం చేశారు. అదే ప్రదేశంలో ఒక మర్రిచెట్టు మొలవడంతో బిచ్చ కొడుకులు వీరన్న, బాలుపోతుల దాన్ని తమ తండ్రికి ప్రతిరూపంగా భావిస్తూ వస్తున్నారు. మొక్క పెరుగుతున్న కొద్దీ దానికోసం బిచ్చ తల్లిదండ్రులు హరిచంద్రు, ధనమ్మ 30గుంటల స్థలాన్ని వదిలేసి ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చారు. కొడుకులు పెరిగాక ఆ చెట్టును మరింత అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. చెట్టు ఆకులను తెంపడం, కొమ్మలు నరకడం వంటివి చేయరు.. తండా ప్రజలు ఏ పని మొదలు పెట్టినా ఆ చెట్టు వద్దకు వచ్చి దండం పెట్టుకుంటారు. చెలుకలో ఉన్న చెట్లను అమ్ముకుంటున్న ఈ రోజుల్లో ఓ మర్రిచెట్టుకోసం స్థలాన్ని వదిలి దానిని తమ తండ్రికి ప్రతిరూపంగా చూసుకుంటున్న కొడుకుల గురించి తెలిసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నాన్నను చూసుకుంటున్నాం
మా నాన్న చనిపోతే మా వ్యవసాయ భూమిలోనే ఖననం చేశాం. అదే ప్రదేశంలో మర్రి చెట్టు పెరిగింది. మా నాన్నే మళ్లీ చెట్టు రూపంలో పూట్టాడని నమ్మకంతో చెట్టును ప్రాణంగా పెంచాం. ఇప్పుడు విశాలంగా పెరిగింది. చెట్టు ఎంత పెద్దదైనా స్థలం కోసం ఇబ్బంది లేకుండా ఉండేందుకు 30 గుంటల స్థలం వదిలాం. ఏ పనైనా మర్రిచెట్టుకు దండం పెట్టిన తర్వాతే మొదలుపెడుతాం.
-బానోతు వీరన్న
మర్రి చెట్ట పక్కనే దుర్గమ్మ గుడి..
మర్రి చెట్టు కోసం వదిలిన 30 గుంటల స్థలంలోనే దుర్గమ్మ గుడి నిర్మించారు. ఏటా దుర్గమ్మకు బోనాలు తీసి మొక్కులు చెల్లిస్తారు. మర్రి చెట్టుకు గిరిజనుల ఆచారం ప్రకారం పూజలు చేస్తారు. ఇక్కడికి పూజల కోసం మహబూబాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు.
గొప్ప విషయం
భూముల్లో ఉన్న చెట్లను తొలగించి వ్యవసాయం చేస్తున్న ఈ రోజుల్లో ఒక మర్రి చెట్టు కోసం వాళ్ల నాన్నకు గుర్తుగా అన్నదమ్ములు వీరన్న, బాలుపోతుల 30 గుంటల స్థలం వదిలిపెట్టడం గొప్పవిషయం. ఎండకాలంలో చాలామంది ఈ చెట్టుకిందే సేద తీరుతారు. చెట్టు పక్కనే గుడి ఉండడంతో మొక్కులు చెల్లించుకొని చెట్టకింద వంటలు చేసుకుంటారు.