కరీమాబాద్, మార్చి 23 : ఆటలతో ఒత్తిడిని అధిగమించొచ్చని 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ మైదానంలో ఇంటర్ బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2022 2వ రోజు పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు విధులతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. మామునూరులో వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్రంలోని 13 బెటాలియన్ల సిబ్బంది హోరాహోరీగా తలపడుతున్నారు. క్రీడాకారులు ఒకరిని మించి మరొకరు ప్రదర్శన ఇస్తున్నారు. విజయం కోసం నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు.