చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు మోస్తరు వర్షం కురిసినట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి గుర్రాల జీవరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. పరకాలలో 0.6 సెంటీ మీటర్లు, శాయంపేటలో 1.92 సెం.మీ, గీసుగొండలో 1.16 సెం.మీ, ఆత్మకూరులో 0.46 సెం.మీ, దుగ్గొండిలో 0.56 సెం.మీ, నల్లబెల్లిలో 1.62 సెం.మీ, నర్సంపేటలో 2 సెం.మీ, సంగెం లో 6.6 సెం.మీ, వర్ధన్నపేటలో 1.18 సెం.మీ, నె క్కొండలో 2.04 సెం.మీ, రాయపర్తిలో 2.56 సెం.మీ, పర్వతగిరిలో 1.42 సెం.మీ, ఖానాపూర్లో 3.12 సెం.మీ, చెన్నారావుపేటలో 1.84 సెంటీమీటర్ల చొప్పున సగటున 1.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీవో వివరించారు.
మత్తడి దుంకుతున్న చెక్డ్యాంలు
వర్ధన్నపేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆకేరువాగులోని చెక్డ్యాంలు నిండి మత్తడి దుం కు తున్నాయి. వాగు పరివాహక ప్రాంతాల్లోని ఇల్లం ద, వర్ధన్నపేట, కొత్తపల్లి, నల్లబెల్లి, ల్యాబర్తి గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు లభిస్తున్నది. వర్ధన్నపేట చెక్డ్యాం మత్తడి పడుతుండడంతో వాగు కింద ప్రాంతంలోని చెక్డ్యాంలకు నీరు చేరుతున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో కూలిన పెంకుటిండ్ల్లు
దుగ్గొండి : మండల వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో మండలంలోని రేఖంపల్లి, దుగ్గొండి, వెంకటాపురంలో పెంకుటిండ్లు, పూరి గుడిసెల గోడలు కూలిపోయాయి. మండలంలోని రేఖంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరబోయిన కుమారస్వామికి చెంది న ఇంటి ప్రహరీ కూలగా, వెంకటాపురం గ్రామానికి చెందిన జీ సారయకు చెందిన ఇంటి గోడలు పడిపోయాయి. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు విన్నవించారు.
ఉప్పొంగుతున్న నడికూడ వాగు..
నడికూడ : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నడికూడ వాగు ఉప్పొంగుతోంది. పరకాల హుజూరాబాద్ వెళ్లే వాహనదారులు, గ్రామస్తులు వాగును చూస్తూ మురిసిపోతున్నారు.