పాలకుర్తి రూరల్, మార్చి 23 : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగట్టేందుకు రైతులు ఉద్యమానికి సిద్ధం కావాలని, బీజేపీ సర్కారుపై కదం తొక్కాలని రైతులకు రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి సభ కోసం పాలకుర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. విధివిధానాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంజాబ్ తరహా కేంద్రమే తెలంగాణలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఆకలి రాజ్యం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఉద్యమించాలన్నారు. రైతులపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ గ్రామ స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టేలా కార్యాచరణను రూపొందించామన్నారు. దేశంలో రైతు పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రం మాత్రం రైతులను ఇబ్బంది పెట్టే విధానాలను అవలంబిస్తోందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సభకు రెండు వేల మంది రైతులు తరలివస్తారని చెప్పారు. సభను విజయవంతం చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కడుదుల కరుణాకర్రెడ్డి, గొనె మైసిరెడ్డి, గాదెపాక శ్రీనివాస్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, అడ్డూరి మాధవరావు, కటారి పాపారావు, సుధాకర్రెడ్డి, బానోత్ మహేందర్ ఉన్నారు.