వరి, పత్తి, మక్క వంటి సంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులు.. కొత్త పంథాలో ముందుకు‘సాగు’తున్నారు. ఇటు పంటలతో పాటు సాగు విధానాన్నీ మార్చి నీటిని ఆదా చేసే మల్చింగ్, పాలీహౌస్, పందిరి సాగు వంటి ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. జనగామ జిల్లాలోని రైతులు తీగజాతి రకాలైన బీర, కాకర, అడవి కాకర, సోరకాయతో పాటు బెండకాయ, వంకాయ, టమాట, మిర్చి, ఇతరత్రా పంటలు సుమారు 700 ఎకరాల్లో సాగుచేస్తూ సిద్దిపేట, కరీంనగర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇలా ఆధునిక సేద్యం చేస్తున్న లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సంప్రదాయ పంటలు సాగుచేస్తూ నష్టాల పాలైన రైతులు కూరగాయల సాగుపై దృష్టిపెట్టారు. ఇందుకోసం తుంపర, బిందు సేద్యం లాంటి నీటిని ఆదా పద్ధతులను పాటిస్తూనే మల్చింగ్, పాలీహౌస్, పందిరి సాగును అవలంబిస్తున్నారు. ఈ సీజన్లో జనగామ జిల్లాలో 700 ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. జిల్లాలో కాకర, బీరకాయ 300 ఎకరాలు, టమాట 100 ఎకరాలు, బెండ, మిర్చి 120 ఎకరాలు, వంకాయ 50 ఎకరాలు, ఇతర కూరగాయాలు 130 ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ పండించిన కూరగాయలను సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలోని మార్కెట్కు తరలిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా నర్మెట మండలం వెల్దండలో వాణిజ్య పంటల స్థానంలో కూరగాయల సాగు అనూహ్యంగా పెరిగింది.
శాశ్వత పందిళ్ల సాగు
తీగజాతి రకాలైన సోరకాయ, బీర, కాకరకాయ సాగు కోసం ఉద్యానశాఖ అధికారులు చాటా మండలాల్లో శాశ్వత పందిళ్లు వేసి ఇచ్చారు. ఇదే సమయంలో అడవి కాకరను పరిచయం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటడంతో రైతులు శాశ్వత పందిళ్లతో ఉత్సాహంగా కూరగాయలు సాగుచేసేందుకు మొగ్గుచూపారు.
నాలుగున్నర ఎకరాలు.. 15 క్వింటాళ్లు
వెల్దండకు చెందిన లింగాల పరశురాములు 4.5 ఎకరాల్లో తీగజాతి కూరగాయలు పండిస్తూ లాభాలు అర్జిస్తున్నాడు. ఇందుకోసం ఉద్యానశాఖ ఇచ్చిన పందిళ్లను ఏర్పాటుచేశాడు. ఒక ఎకరంలో పందిళ్లు వేసేందుకు రూ.3లక్షల వరకు ఖర్చు కాగా ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 లక్షల సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఒక్కో ఎకరానికి సుమారు 4 నుంచి 5 క్వింటాళ్ల చొప్పున నాలుగెకరాల్లో 15 క్వింటాళ్ల కూరగాయలు పండిస్తున్నాడు. ఒక్కో కాపులో సుమారు రూ.3 నుంచి 4 లక్షల వరకు లాభాలు వస్తాయని రైతు చెబుతున్నాడు. రెండు రోజులకోసారి కాయగూరలను తెంపి సిద్దిపేట, కరీంనగర్ మార్కెట్లకు తరలిస్తున్నాడు. తన కుటుంబసభ్యులతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ సాగులో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు..
నీటి వసతి ఉన్న రైతులు స్వల్పకాలిక ఉద్యాన సాగుకు మొగ్గుచూపితే ఎంతో మేలు. ఏడాదిలో మూడు పంటలు వేయొచ్చు. ఒక పంటతో గిట్టుబాటు లేకుంటే రెండవ పంటతో అయినా తప్పకుండా లా భం వస్తుంది. సాగులో నీటి ఆదా పద్ధతులు తుంపర, బిందుసేద్యం, మల్చింగ్ పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులతో ఆద్భుత విజయాలు సాధించవచ్చు. ఇవి మూడు నెలల కాలపు పంటలు కావడంతో పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు చేతికొస్తాయి. స్థానిక మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే లాభం వస్తుంది.
సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి..
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాలి. కూరగాయల సాగులో ప్రతిరోజూ అప్రమత్తంగా ఉండాలి. ఇందులో కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా ఉంటుంది. హార్టికల్చర్ అధికారులు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలి. అలాగే మార్కెట్కు పంట తరలించేందుకు ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుంది.