వరంగల్, సెప్టెంబర్ 27: నగరంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కోరుతూ బల్దియా గ్రీవెన్స్లో వినతులు వెల్లువెత్తాయి. వరంగల్ కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో సోమవారం కమిషనర్ ప్రావీణ్య గ్రీవెన్స్ నిర్వహించారు. వచ్చే నెలలో జరిగే ఉర్సు దసరా ఉత్సవాలకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాలంకరణలను తమకు కేటాయించాలని అండర్ రైల్వేగేట్ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమంచ శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు అక్తర్, రాజేందర్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నందిహిల్స్లోని ఇంటి నంబర్ 1-7-900/ఏ/73 ఇంటి ఎదురుగా సీసీ రోడ్డును ఆరు ఫీటు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని స్థానికుడు వేణుమాధవ్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. స్నేహనగర్రోడ్డు నంబర్ 12లో ఇంటి నంబర్ 2-9-324/2 పక్కన రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని చల్లా రాజిరెడ్డి ఫిర్యాదు అందించాడు. భద్రకాళీ మున్నూరుకాపు కాలనీలో అనుమతులు లేకుండా కట్టెకోత మిషన్ నిర్వహిస్తున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ కాలనీలోని అపార్ట్మెంట్లో రెండేళ్లుగా తాగునీరు రావడం లేదని, అయినా బిల్లు వస్తున్నదని వంగాల సుధారాణి వినతిపత్రం అందజేశారు. గ్రీవెన్స్లో వివిధ విభాగాలకు చెందిన 26 వినతులు వచ్చాయి.