హనుమకొండ చౌరస్తా, : చారిత్రక ఓరుగల్లు వేదికగా నేటి నుంచే క్రీడా సంరంభం ఆరంభం కానుంది. రెండు తెలుగు రాష్ర్టాలోనే తొలిసారిగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు హనుమకొండలోని జేఎన్ఎస్ (జవహర్లాల్ నెహ్రూ అవుట్డోర్ స్టేడియం) సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడ పరుగు పందేల కోసం రూ.7.8కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా సింథటిక్ ట్రాక్ రూపుదిద్దుకున్నది. ఈనెల 19వరకు జరిగే 47 ఈవెంట్లలో తలపడేందుకు దేశ నలుమూలల నుంచి 519మంది (తెలంగాణ – 17) అథ్లెట్లు తరలివస్తుండగా వారికి నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్ కారణంగా ఏడాదిన్నర నుంచి స్తంభించిన క్రీడారంగంలో ఈ వేడుక కొత్త జోష్ నింపుతున్నది. క్రీడాకారులకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ సీపీ తరుణ్జోషి రూపొందించిన వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, పోటీల విజయవంతం కోసం వీధుల్లో చేపట్టిన ఫ్లాష్మాబ్, కూడళ్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద డిజిటల్ స్క్రీన్లతో నగరమంతా సందడి నెలకొంది.
47 ఈవెంట్లు.. 519మంది అథ్లెట్లు..
ఈ నెల 19వరకు జరిగే పోటీల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 519 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 47 ఈవెంట్లలో పాల్గొని వారి ప్రతిభ చూపనున్నారు. వరంగల్ నిట్ మైదానంలో మూడు ఈవెంట్లు నిర్వహించనున్నారు. 20 కేఎం, 35కేఎం, 50 కేఎం రేస్ వాకింగ్(పురుషులు) కోసం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మనోళ్లు 17మంది
రాంచీ, చెన్నై లాంటి మహానగరాల తర్వాత తొలిసారి ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. కాగా ఈ పోటీల్లో అత్యధికంగా హర్యానా రాష్ట్రం నుంచి 57మంది అథ్లెట్లు పాల్గొంటుండగా తెలంగాణ నుంచి 17 మంది పోటీపడుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి జీవంజి దీప్తికి అవకాశం దక్కింది. ఈమె 4×400మీ మిక్స్డ్ రిలే, 200 మీ, 4×100 మీ రిలే ఈవెంట్లలో పాల్గొననున్నది.
8 లైన్లు 400 మీటర్లు.. 10 లైన్లు 100 మీటర్లు
సింథటిక్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తుది మెరుగులు దిద్దారు. ఇందులో 400 మీటర్ల పరుగు కోసం ఎనిమిది లైన్లు, 100 మీటర్ల స్ప్రింట్ కోసం 10 లైన్లు ఉన్నాయి. ట్రాక్ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా ట్రాక్ను రూపొందించారు. ట్రాక్పై నీరు నిల్వకుండా ప్రత్యేక ఏర్పాట్లుచేశా రు. రాష్ట్రంలో కేవలం హైదరాబాద్లో 2002లో సింథటిక్ ట్రాక్ నిర్మించగా వరంగల్లోనే ట్రాక్ రెండోది.
హాజరుకానున్న అంతర్జాతీయ క్రీడాకారులు
రాష్ట్రంలోనే తొలిసారి జేఎన్ఎస్లో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు రానున్నారు. దేశం నలుమూలల నుంచే గాక టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లు సైతం హాజరుకానున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ అంజుబాబీ జార్జ్, టోక్యోలో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా తదితరులు వచ్చే అవకాశం ఉంది.
కొవిడ్ రిపోర్టు ఉంటేనే అనుమతి
ఎన్వోఏసీ పోటీలకు కొవిడ్ పరీక్ష సర్టిఫికెట్ తప్పినిసరిగా ఉండాలి. క్రీడాకారులు ఆర్టీపీసీఆర్ రిపోర్టుతో హాజరుకావాల్సి ఉంటుంది. అది కూడా పోటీలకు 72 గంటల్లోపు తీసుకున్నదై ఉండాలి. కొవిడ్ కారణంగా ఈ పోటీల కోసం వచ్చే ఆఫీసర్లకు తప్ప ఎవరికీ అకామిడేషన్ కల్పించడం లేదు. అథ్లెట్లు, కోచ్లు ఎవరికి వారే వసతి, భోజన ఏర్పాట్లు చేసుకోవాలని ఏఎఫ్ఐ స్పష్టం చేసింది.
ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు..
జాతీయస్థాయి క్రీడా పోటీలకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వైస్ చైర్మన్గా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రెసిడెంట్గా రాజీవ్గాంధీ హనుమంతు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా డాక్టర్ తరుణ్జోషి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి ఉన్నారు.
కాంతులీనుతున్న క్రీడా మైదానం..
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగనుండడంతో ఫ్లడ్ లైట్లు అమర్చారు. దీంతో స్టేడియం ఆవరణంతా విద్యుత్ వెలుగులతో జిగేల్మంటోంది. మంగళవారం సాయంత్రమే వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు చేరుకొని, ట్రాక్పై పరుగెత్తుతూ, వామప్ చేస్తూ కొత్త అనుభూతి పొందారు.
సింథటిక్ ట్రాక్పై పరుగులు..
మట్టి ట్రాక్పై పరుగుతో ఆటగాళ్లకు అనుకున్న టైమింగ్ రాదు. అంతేగాక శిక్షణ సమయంలో తరచూ గాయపడుతుంటారు. వర్షాల వేళ ఇబ్బందులు ఇక షరామామూలే. అయితే మారుతున్న పోటీ ప్రపంచానికనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలంటే ఆటగాళ్లు సింథటిక్ ట్రాక్పై శిక్షణ తప్పనిసరి. ఇప్పుడు వరంగల్ అంతర్జాతీయ క్రీడలకు వరంగల్ వేదికగా మారింది. స్వరాష్ట్ర సా ధన తర్వాత అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది. ఒలింపిక్స్, ప్రపంచస్థాయి పోటీలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధిసూ ్తభారత త్రివర్ణ పతకా న్ని సగర్వంగా ఎగరేయాలనే లక్ష్యంతో ప్రభు త్వం ఈ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చింది.
పండుగ వాతావరణంలో పోటీలు
చీఫ్ విప్ వినయ్భాస్కర్
జేఎన్ఎస్లో అథ్లెటిక్స్ పోటీలను ఐదు రోజుల పాటు పండుగ వాతావారణంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మంగళవారం జేఎన్ఎస్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన సింథటిక్ ట్రాక్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటుచేశామని, ఇది క్రీడాకారులకు ఎంతో మంచి అవకాశమన్నారు. వరంగల్లో నేషనల్ ఈవెంట్ విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చారిత్రక వరంగల్లో ఇప్పటికే ఐటీ, ఎడ్యుకేషన్, క్రీడా హబ్గా రూపొందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పోర్ట్స్ క్యాలెండర్ను రూపొందించి ప్రతినెలా ఒక ఈవెంట్ను చేయనున్నట్లు చెప్పారు. సుమారు 600 వరకు క్రీడాకారులు, టెక్నికల్ ఆఫీషియల్స్, ఇందులో పాల్గొనున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్ అంజూబాబీ జార్జ్ పాల్గొనడం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ ఈవెంట్ దేశంలోని క్రీడాకారులందరికీ గుర్తుండిపోతుందన్నారు. అలాగే క్రీడాకారులు నగరంలోని పర్యాటక కేంద్రాలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సింథటిక్ ట్రాక్తో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించేందుకు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు ఎంతో కృషిచేశారని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్వో గుగులోతు అశోక్కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, తెలంగాణ రాష్ట్ర జూడో కార్యదర్శి కైలాస్యాదవ్, హ్యాండ్బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ పాల్గొన్నారు.
పోటీలను సక్సెస్ చేద్దాం.. : సీపీ తరుణ్జోషి
అథ్లెటిక్స్ పోటీలను సక్సెస్ చేయాలని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ శ్రీదేవి ఏషియన్ మాల్ నుంచి జేఎన్ఎస్ వరకు క్రీడలకు సంబంధించిన లోగోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వారం రోజుల పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోటీల కోసం చాలా కష్టపడుతున్నామని చెప్పారు. క్రీడాకారుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నదన్నారు. అనంతరం పోటీల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్మాబ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ట్రాక్.. వరంగల్కే తలమానికం
ఇన్నాళ్లు మట్టి ట్రాక్పై శిక్షణ పొంది పలు జాతీయపోటీల్లో ఆశించిన టైమింగ్ రాక నిరాశ చెందిన ఎంతోమందికి ఈ సింథటిక్ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏడేళ్ల పోరాట ఫలితంగా ట్రాక్ సాధించుకున్నాం. భవిష్యత్లో క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించే అవకాశముంటుంది. వరంగల్కు ట్రాక్ తలమానికంగా నిలుస్తుంది. ఇక్కడ 60వ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించేందుకు చాలా కృషిచేశాం.
ఒలింపిక్స్ను తలపించేలా..
క్రీడాకారుల భవిష్యత్కు సింథటిక్ ట్రాక్ తోడ్పడుతుంది. మున్ముందు అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిధ్యానికి అవకాశముంటుంది. ఈ ట్రాక్ నిర్మాణంతో రన్నింగ్ ఈవెంట్ల పరంగా అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. రూ.7.80 కోట్లతో సింథటిక్ ట్రాక్ నిర్మించాం. 8 లైన్లు 400 మీటర్లు, 10 లైన్లు 100 మీటర్లు సింథటిక్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. గేట్ ఏర్పాటుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాం.
చాలా సంతోషంగా ఉంది..
మా కృషికి ఫలితంగా ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉంది. సింథటిక్ ట్రాక్ క్రీడాకారుల భవిష్యత్కు మంచి అవకాశం. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ ద్వారా క్రీడాకారులకు పతకాలు సాధించవచ్చు. జేఎన్ఎస్లో అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి ఎంతో కృషిచేశాం. రెండు నెలలుగా రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేయించాం. నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు ఇక్కడ నిర్వహించేందుకు చాలా శ్రమించాం. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
నేడు జరిగే పోటీల వివరాలు
6.30 గంటలకు 5000 మీటర్లు పురుషులు (ఫైనల్-1)
7.15 గంటలకు 5000ఎం మహిళలు (ఫైనల్-2)
8.10 గంటలకు 100ఎం (పురుషులు)
9గంటలకు లాంగ్జంప్ (పురుషులు)
10.15 గంటలకు షార్ట్పుట్ (పురుషులు)
మధ్యాహ్నం సెషన్
3 గంటలకు హైజంప్ (పురుషులు)
3.30 గంటలకు పోలె వాయుల్ట్(మహిళలు)
4.05 గంటలకు లాంగ్జంప్(పురుషులు)
4.15 గంటలకు 400 మీటర్స్ (పురుషులు)
4.30 గంటలకు 400 మీటర్స్ (మహిళలు)
4.45 గంటకు 100 మీటర్స్ (పురుషులు)
5 గంటలకు 100 మీటర్స్ (మహిళలు)
5.15 గంటలకు 400 మీటర్స్ (పురుషులు)