కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 23నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానుండగా జిల్లాలోని 6,939మంది విద్యార్థుల కోసం 43కేంద్రాలను సిద్ధంచేసింది. వీటిలో తాగునీరు, బెంచీలు, షామియానాలతో పాటు పారదర్శకత కోసం అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. పరీక్షా కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఈసారి కొత్తగా సెంటర్ లొకేటర్ యాప్ను రూపొందించారు. అలాగే అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి.. పరీక్షలకు సంసిద్ధులను చేసిన ఉపాధ్యాయులు.. 28మంది విషయ నిపుణులతో ‘కాల్ యువర్ టీచర్’ పేరిట ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అపోహలు, అనుమానాలను నివృత్తి చేశారు. అత్యుత్తమ ఫలితాలతో జనగామను మొదటివరుసలో నిలువాలని ఆకాంక్షించారు.
జనగామ, మే 19 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 23 నుంచి మొదలయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. 12 మండలాల పరిధిలో 103 ప్రభుత్వ జిల్లా పరిషత్ హైసూళ్లు, 86 ప్రైవేట్ హైసూళ్లు కలిపి మొత్తం 189 పాఠశాలల్లో మొత్తం 6,939 మంది రెగ్యులర్, 9మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 5,278మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 1,796 మంది ఉన్నారు. బాలురు 3,498, బాలికలు 3,576 మందికి గానూ ప్రభుత్వ పాఠశాలల్లో 2,435 మంది, బాలికలు 2,843మంది, ప్రైవేట్లో బాలురు 1,063 మంది, బాలికలు 7,33మంది ఉన్నారు. ఇందుకోసం 43 కేంద్రాలను ఏర్పాటుచేసి నిర్వహణ కోసం 43 మంది సిట్టింగ్ స్కాడ్లు, రెండు ఫ్లైయింగ్ స్వాడ్లు(ఇందులో ఎంఈవో, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు), 401 మంది ఇన్విజిలెటర్లు, 43 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 43 మంది డీవోలు, ఒక ఏడీఓ ఉంటారు.
ఈసారి అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు చేస్తుండగా, ఇప్పటికే టెన్త్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పేపర్-1, 2 ప్రశ్నపత్రాలు పోలీస్స్టేషన్కు చేరగా, లాకర్లో భద్రపరిచారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనుండగా దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలను కేంద్రానికి తరలించి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు సీసీ కెమెరా నిఘాలో సీల్ తీస్తారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది ఫొటో ఐడీ కార్డు ధరించడం తప్పనిసరి చేసిన విద్యాశాఖ, కేంద్రంలో బెంచీలపైనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, అలాగే పోలీసులకు సైతం పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి లేదని, సీఎస్, డీవోలు సైతం సెల్ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రం ఎక్కడుందో సులువుగా తెలుసుకునేందుకు ఈసారి ప్రత్యేకంగా ‘సెంటర్ లొకేటర్’ యాప్ను రూపొందించారు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సాంకేతిక సమాచార సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా..
గతంలో మాదిరిగా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వేసవి సెలవులున్నప్పటికీ ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులను బోధించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి పట్టుదలతో చదివేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు ఒక గంటపాటు ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించారు. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం పరీక్షల సమయం వరకు ప్రతిరోజు గంటపాటు సబెక్టు టీచర్లు పాఠశాలకు హాజరై అదనపు క్లాసులు తీసుకొని ఏ రోజుకు ఆరోజు స్లిప్ టెస్టులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు వీలుగా మిగితా విద్యార్థులతో ముఖాముఖి చర్చించుకోవడం ద్వారా అనుమానులను నివృత్తి చేసి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా తాజాగా పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థు అనుమానాలు, అపోహలు నివృత్తి చేసేందుకు జిల్లాలో కొత్తగా ‘కాల్ యువర్ టీచర్’ పేరిట ఫోన్ ఇన్ ప్రోగ్రాం తలపెట్టారు. ఈ నెల 13 నుంచి 21 వరకు విద్యార్థులు ఫోన్ చేసేలా టోల్ఫ్రీ నంబర్ కేటాయించి 28 మంది సబ్జెక్టు నిపుణులతో రెండు గంటల పాటు వందలాది మంది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లుచేశాం..
జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలు నిర్వహించే 43 కేంద్రాల్లో తాగునీటి వసతి, బెంచీలు, షామియానాలు వేయిస్తున్నాం. పారదర్శకంగా ఉండేలా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు అమర్చాం. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వెనుకబడిన వారిని గుర్తించి సబ్జెక్టులపై మరింత పట్టువచ్చేలా ప్రయత్నించాం. వార్షిక పరీక్షలంటే విద్యార్థుల్లో భయం పోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఇప్పటికే చదివిన అంశాలు రివిజన్ చేసుకొని పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షల్లో జనగామ జిల్లా వంద శాతం ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది.
-కే రాము, జిల్లా విద్యాశాఖాధికారి