స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 5 : ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్టేషన్ఘన్పూర్లోని పల్లగుట్ట క్రాస్రోడ్ వద్ద రూ.25 లక్షలతో ఏర్పాటు చేయనున్న చేపల మార్కెట్కు ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలారు. అలాగే గొర్రెలో పుర్రు వ్యాధి నివారణ కోసం టీపీఆర్ వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి తలసాని మాట్లాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని ఉంటే చూపించాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. తెలంగాణ రాక ముందు ఇక్కడి ప్రజలకు 24గంటల కరెంటు ఇస్తామంటే ఎవరన్నా వద్దన్నారా, సాగునీరు ఇస్తామంటే వద్దన్నారా, ఉద్యోగాలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 2016 రూపాయల పెన్షన్ వంటి పథకాలను మీరు ఇస్తామంటే ఎవరన్నా వద్దన్నారా అని ప్రశ్నించారు. మత్స్య పారిశ్రామిక సంఘం వారికి రూ.10 లక్షలు ఇచ్చి ఇదే ప్రపంచం అని చెప్పిన సందర్భాలను మనందరం చూశామని అప్పుడు రిజర్వాయర్లలో సరిపడా నీరుండకపోయేదని ఇప్పు డు 365 రోజులు నీళ్లు ఎలా ఉంటున్నాయో గమనించాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రేషన్ దుకాణానికి వచ్చి మోదీ ఫొటో పెట్టాలనడం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.