పాలకుర్తి (జనగాం ) : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల వారికి మేలు చేస్తున్న విధంగానే రేషన్ డీలర్లకు సముచిత గౌరవం ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. గురువారం రేషన్ డీలర్ల (Ration Dealers ) ఆత్మీయ సమ్మేళనం పాలకుర్తిలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ ( CM KCR ) లాంటి ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ఎవరూ చూడలేదని అన్నారు. తెలంగాణ కు ముందు రేషన్ డీలర్లకు కేవలం టన్నుకు రూ. 200 లుంటే నేడు ఏడు రెట్లు పెంచి రూ. 1400కు ఇస్తున్నామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ప్రభుత్వం పై ఏటా అదనంగా రూ.139 కోట్ల భారం పడుతుందని వివరించారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించ కూడదనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 90 లక్షల 5 వేల కార్డుల్లో దాదాపు 35 లక్షల 56 వేల కార్డుల్లోని 91 లక్షల మందికి ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికీ ఆరుకిలోల చొప్పున బియ్యం అందిస్తుందని అన్నారు. కేంద్రం కమిషన్ పెంచుకున్నా రాష్ట్రమే పెంచి ఇస్తుందని వెల్లడించారు.
కరోనా సమయంలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయించి కేసీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. రేషన్ డీలర్లలకు బీమా, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ షాపు ల రెన్యూవల్ను ఐదేండ్లకు పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ను తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.
హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపుతో పాటు 13 అంశాలపై సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేరని తెలిపారు. సీఎం కేసీఆర్కు డీలర్లు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో రోజా రాణి, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.