ఒకప్పుడు కటిక కరువును ఎదుర్కొని, స్వరాష్ట్రంలో అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో తరలివచ్చిన గోదావరి జలాలతో సస్యశ్యామలమైన జనగామ నేల.. నేడు జననేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సాదర స్వాగతం పలికేందుకు ముస్తాబైంది. సమీకృత కార్యాలయ భవనం(కలెక్టరేట్), టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి శుక్రవారం సీఎం కేసీఆర్ రానుండగా జిల్లా అధికారయంత్రాంగం, పార్టీ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. సాయంత్రం యశ్వంతాపూర్ సమీపంలో లక్షకు పైగా తరలివచ్చే ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా, పోచంపల్లి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జనగామ, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామలో పర్యటించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 11గంటలకు హెలిక్యాప్టర్లో కొత్త కలెక్టరేట్కు చేరుకుంటారు. 11.10గంటలకు సమీకృత కలెక్టరేట్ భవన సమూదాయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో జనగామ అభివృద్ధిపై సమీక్షిస్తారు. భోజన విరామ అనంతరం 2గంటలకు యశ్వంతాపూర్ వద్ద నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడే జిల్లా ముఖ్యులతో సమావేశమవుతారు. సాయంత్రం 3గంటలకు సమీపంలోని బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐసీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి తదితరులు సీఎం బహిరంగ సభ ప్రాంగణం, వేదిక ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించి ఎలాంటి లోటులేకుండా సిద్ధం చేశారు. సభకు తొలుత అంచనా వేసిన 80వేల మంది కంటే మించి పెద్దఎత్తున హాజరుకానున్న నేపథ్యంలో ప్రజలు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేశారు. సభాస్థలితో పాటు చౌరస్తా నుంచి కొత్త కలెక్టరేట్ వరకు, చౌరస్తా నుంచి యశ్వంతాపూర్ సభా ప్రాంగణం వరకు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి సహా పలువురి పేరిట భారీ బెలూన్లు, కటౌట్లు ఏర్పాటుచేశారు. కలెక్టరేట్లో భోజనం, పూజ వంటి ఏర్పాట్లును జిల్లా అధికార యంత్రాంగం పూర్తిచేసింది.
జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డులోని కొత్త కలెక్టరేట్ వరకు డివైడర్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. జిల్లాకేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు పనులు చేపట్టారు. ఒకపక్క కొత్త కలెక్టరేట్ లోపల, బయట మిగిలిన ఉన్న పనులు చేపట్టడం సహా వెలుపల కూడా రోడ్డు మార్గం అద్దంలా మెరిసేలా చూడాలనే ఆదేశాలతో పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది రాత్రింబవళ్లు సిబ్బంది శ్రమిస్తున్నారు. చౌరస్తా నుంచి సూర్యపేట రోడ్డులో కొత్త కలెక్టరేట్ వరకు డివైడర్లు పచ్చదనం ఉండేలా, అటు పెంబర్తి నుంచి జనగామ వరకు ఇటు యశ్వంతాపూర్ నుంచి చౌరస్తా మార్గంలో పారిశుద్ద్య కార్యక్రమాలు, రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. కొత్త కలెక్టరేట్ నుంచి ఇటు చౌరస్తా, యశ్వంతాపూర్ మీదుగా పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.
కరువు ప్రాంతం జనగామను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేసి.. జిల్లాగా ఏర్పాటు చేసి.. అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలుకాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బహిరంగ సభాస్థలిని గురువారం ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించి పర్యటన వివరాలు వెల్లడించారు. 70 నుంచి 80వేల మందితో జనగామలో సభ పెట్టాలనుకుంటే తెలంగాణపై మోదీ విషపు వ్యాఖ్యలతో ప్రజలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలనే పట్టుదలతో ఉన్నారని, అందుకే లక్షా 30వేల మంది రావచ్చనే అంచనాతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు సీఎం సభకు భారీ ఎత్తున పోటెత్తనున్నారని చెప్పారు.
జనగామ జిల్లాను ఇచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేసి జిల్లాకు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలుకుతామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే కేసీఆర్ నాయకత్వంలో జనగామలో అభివృద్ధి జరుగుతున్నదని, గతంలో చెరువులు, బావులు ఎండిపోయి ఈ ప్రాంతం కరువుకు కేరాఫ్గా ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ, దేవాదుల జలాలతో నేడు సస్యశ్యామలమైందని ఇదంతా కేసీఆర్ కృషి ఫలితమేన్నారు. ఎడారిగా ఉన్న జనగామ కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు ఆకుపచ్చగా మారిందని, తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి జిల్లాకు తాగు, సాగునీరు ఎలా వచ్చిందో గతానికి, ఇప్పటికి బేరీజు వేస్తుకుంటే అర్థమవుతుందన్నారు. ప్రతి చెరువు, కుంటకు పుష్కలంగా దేవాదుల ద్వారా గోదావరి జలాలు రావడంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారని, దేశంలో ఒక పంటలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో నీరు రాని ఊరు ఉండొద్దని సీఎం చెప్పారని, అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్ని గ్రామాలకు నీళ్లు ఇద్దామని చెప్పారన్నారు. దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రస్థాయి కార్యాలయాలు కూడా లేవని..ప్రజలకు చేరువగా అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.