Anti Ageing | వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు కనిపించడం సహజం. అయితే కేవలం వయసే కాదు, చర్మంలో తేమ తగ్గడం, స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, అధిక సూర్యరశ్మి, కాలుష్యం, ధూమపానం, అలాగే పోషకాహార లోపాలు కూడా ముడతలు త్వరగా రావడానికి కారణమవుతాయి. చాలా మంది వీటిని తగ్గించేందుకు ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్థాలతో కూడా చర్మ సంరక్షణ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మొట్టమొదటగా గుడ్డు తెల్లసొనను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో గుడ్డు తెల్లసొనను బాగా గిలక్కొట్టి నేరుగా ముఖంపై రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. సుమారు 15 నిమిషాలు లేదా పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ చర్మాన్ని పోషించి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆలివ్ ఆయిల్ కూడా చర్మానికి మంచి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ను ముఖంపై మృదువుగా మసాజ్ చేసి, అదనంగా ఉన్న నూనెను మృదువైన వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి చర్మం మరింత మృదువుగా, తేమతో కనిపించే అవకాశం ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసాన్ని ముడతలు ఉన్న ప్రాంతాల్లో రాసి సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఇది చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేయడంలో తోడ్పడుతుంది. అయితే నిమ్మరసం ఆమ్ల గుణాలు కలిగి ఉండటంతో ఎక్కువగా లేదా తరచూ ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. అలోవెరా జెల్లో ఉండే మాలిక్ యాసిడ్ చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తాజా అలోవెరా ఆకులోని జెల్ను తీసి ముఖంపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. లేదా విటమిన్ ఇ ఆయిల్తో కలిపి కూడా ఉపయోగించవచ్చు.
అరటిపండులోని పోషకాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. రెండు అరటిపండ్లను మెత్తగా మెదిపి పేస్ట్లా చేసి ముఖంపై రాసి సుమారు అరగంట తర్వాత కడిగేయాలి. కావాలంటే తేనె, అవకాడోతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. క్యారెట్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉడికించిన క్యారెట్ను తేనెతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. అలాగే క్యారెట్ను నేరుగా ఆహారంగా తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అనాసపండులో ఉండే ఎంజైములు చర్మానికి తేమను అందించడంతో పాటు చనిపోయిన కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అనాసపండు ముక్కను నేరుగా ముఖంపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మ ఆరోగ్యానికి అత్యంత సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం, చర్మం తేమను నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుంది. దీంతో చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపించే అవకాశాలు మెరుగుపడతాయి.