న్యూశాయంపేట, జూన్ 7: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమకొండ నిట్ సమీపంలోని మయూరి గార్డెన్లో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాగును పండుగలా మార్చారని, మిషన్ కాకతీయలో భాగంగా 46వేల చెరువులకు పునర్జీవం పోయగా, కోటి ఎకరాల మాగాణి కల సాకారం అయ్యిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే దేవాదుల ప్రాజెక్టుకు అధిక కేటాయించగా మూడో స్టేజీ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాకతీయ కెనాల్లో 365 రోజులు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండడం మనకు వరమన్నారు. నీళ్లతో పాకాల, లక్నవరం, ధర్మసాగర్, రిజర్వాయర్లు నింపినట్లు వివరించారు. సాగునీటి రంగంలో తెలంగాణ అభివృద్ధిలో స్వర్గీయ విద్యాసాగర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు ఏనుగుల మానస, తోట వేంకటేశ్వర్లు, రిటైర్డ్ ఇరిగేషన్ సీఈ వీరయ్య, ఈఈ భద్రయ్య, డీఈఈ నర్యయ్య, ఈఈ సీతారాం, డిఈ కిరణ్ పాల్గొన్నారు.