ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జనగామకు రానున్నారు. ఈ నెల 11న జిల్లా సమీకృత భవనాల సముదాయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్ వద్ద 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు శనివారంరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా, పోచంపల్లి, తక్కళ్లపల్లి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ, అరూరి, నన్నపునేని, జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, ఇతర జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ముఖ్య నేతలతో సమాలోచనలు చేసి బాధ్యతలు అప్పగించారు.
– జనగామ, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ)
జనగామ, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేసి ఈనెల 11న జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. శనివారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్, వరంగల్ ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి కొత్త కలెక్టరేట్లో కలెక్టర్ శివలింగయ్య ఇతర జిల్లా అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.ఆ తర్వాత హనుమకొండ హైవేలో జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద సీఎం బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. బహిరంగసభ, పార్కింగ్ కోసం స్థలం ఖరారైన వెంటనే గ్రౌండ్ను చదును చేయడంతోపాటు వాస్తు ప్రకారం వేదికను ఏ దిశలో నిర్మించాలి? సభా వేదిక, ఇతర ఏర్పాట్ల కోసం సూచనలు చేశారు. అనంతరం పర్యటన విజయవంతం కోసం పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో కలిసి సమాలోచనలు చేశారు. ఇన్చార్జిలతో పాటు కమిటీలను నియమించి బాధ్యతలు అప్పగించారు.
జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని, అందుకోసం నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సమష్టిగా పనిచేయాలని కోరారు. సభా వేదిక అలంకరణ, వసతుల కల్పన సహా వాహనాల పార్కింగ్, సభకు హాజరయ్యే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే అంశాలపై చర్చించారు. పార్కింగ్ స్థలాల్లో వీవీఐపీలు, వీఐపీలు, మీడియా, పోలీసులు, అధికారులు సహా జనాన్ని తరలించే వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ కోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, పార్టీ వర్గాల సమాచారం మేరకు 11న ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 11.30 గంటలకు కొత్త కలెక్టరేట్లో నిర్మించిన హెలిప్యాడ్కు చేరుకునే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులతో జరిగిన అంతర్గత సమావేశంలో మంత్రి సూచించినట్లు తెలిసింది. తొలుత సమీకృత కలెక్టరేట్ సమూదాన్ని ప్రారంభించి భవనాన్ని పరిశీలించిన తర్వాత జిల్లా అభివృద్ధి, ప్రణాళికపై అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించనున్నారు.
మధ్యాహ్నం భోజన విరామ తర్వాత జనగామ చౌరస్తా, పాలకేంద్రం మీదుగా లేదంటే నెల్లుట్ల బైపాస్ నుంచి రోడ్డు మార్గంలో యశ్వంతపూర్లోని టీఆర్ఎస్ తెలంగాణ భవన్కు ఒంటి గంటకు చేరుకొని జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే బహిరంగ సభలో మాట్లాడుతారని సమాచారం. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సెవెల్లి సంపత్, మర్రి యాదవరెడ్డి, జన్ను జకార్య, బండ యాదగిరిరెడ్డి, కందుకూరి ప్రభాకర్, డాక్టర్ సుధాసుగుణాకర్రావు, దూసరి గణపతి, పోకల శివకుమార్ పాల్గొన్నారు.
సీఎం కే.చంద్రశేఖర్రావు జనగామ పర్యటన ఖరారైన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఎంపీ, ఎమెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి నూతన కలెక్టరేట్ ప్రాంగణం, హెలిప్యాడ్, సీఎం పూజలలో పాల్గొనే హాల్, అధికారులతో సమీక్షించే గది, భోజనం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి మీటింగ్ హాల్, ఆయా శాఖల అధికారులకు కేటాయించిన గదులకు ఆయన స్వయంగా వెళ్లి చూశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్లలో లోపం ఉండకుండా చూడాలని కలెక్టర్కు సూచించారు. కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, లైటింగ్ సిస్టం సమర్థవంతంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.