హనుమకొండ చౌరస్తా, మే 18 : 90 సంవత్సరాలుగా వరంగల్ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం చాలా నిరాశాజనకమైన విషయమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను పట్టించుకోకుండా హెచ్సీఏ నేపథ్యంగా బీసీసీఐ నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే పనిచేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వరంగల్ జిల్లా కార్యదర్శి జైపాల్రెడ్డి విమర్శించారు. తూతూమంత్రంగా వేసవి శిక్షణ శిబిరాల పేరుతో ఎంపికలు నిర్వహిస్తున్నామని చూపిస్తూ, నిజంగా టాలెంట్ను ఉన్నవారిని ఎంపిక చేయకుండా వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంత యువకుల నుంచి సెలక్షన్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఘటనలు పెద్దసంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. సామాన్య క్రీడాకారులకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నా, న్యాయమైన ఎంపిక ప్రక్రియ లేకుండా హక్కులపై పాలుపంచుకునే స్థాయిలో వ్యవహరిస్తుందన్నారు. ఇది కేవలం క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకోవడం మాత్రమే కాదు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే అవకాశాలను కూడా దెబ్బతీసే చర్యగా మిగులుతుందన్నారు. జిల్లాల క్రికెట్ అభివృద్ధికి నిజమైన న్యాయం జరగాలని, ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లా నుంచి ఏ ఒక్క ఇంటర్నేషనల్ ప్లేయర్ను ఇన్నేళ్లనుంచి తయారు చేయలేదని, కేవలం ఏజ్ గ్రూప్ ఎలక్షన్స్, సమ్మర్ క్యాంపులు అంటూ వచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
అదే ఆంధ్రలో జిల్లాకో రంజీ మ్యాచ్లు నిర్వహిస్తారని, జిల్లాకు రూ.15 లక్షలు ఇస్తే వెళ్లి మళ్లీ తెచ్చుకోవడం తప్ప ఏ ఒక్క క్రీడాకారుడిని ఎంపిక చేసి పంపించిన దాఖలాలు లేవని, జిల్లా సెక్రటరీ కూడా ఇంతవరకు ఎంపిక చేసిందిలేదని మండిపడ్డారు. క్రికెట్ అసోసియేషన్లో జాబ్ కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వారే చేస్తున్నారని, అంపైర్స్ గ్రౌండ్మెన్, కోచ్స్, మేనేజర్స్ అన్ని రకాల జాబ్లు కూడా కనీసం జిల్లావారు కూడా లేరని మండిపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం, బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకుని హెచ్సీఏలో ఉన్న అవినీతిని, నియమాలలేమిని పరిశీలించి, గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.