‘కాంగ్రెస్సోళ్లుగాని, బీజేపోళ్లుగాని ఏనాడన్న రైతులను పట్టించుకున్నరా? సాగునీళ్లు, పెట్టుబడి సాయం ఇయ్యాలన్న ఆలోచన చేసిన్రా..? ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, కరెంటన్న ఇచ్చిందా? నీళ్లు లేక భూములన్ని పడావుపడ్డయ్.. రైతులు కూలీలై పనుల్లేక వలసపోయిన్రు.. తెలంగాణ వచ్చినంకనే ఎవుసం బాగుపడ్డది.. భూములన్నీ పచ్చబడ్డయ్.. భూముల విలువ కూడా పెరిగింది. రైతుల మొఖం తెలివైంది. చేతిల నాలుగు పైసలు కనవడుతున్నయ్. ప్రతి ఊల్లె ఏదోఒక పనిదొరుకుతాంది.. ఇంత మంచిగైనంక మళ్ల కాంగ్రెస్కు అవకాశం ఇస్తే అంతా ఆగమైతది.. మంచిగ కట్టుకున్న ఇంటిని ఇచ్చగొట్టినట్లయితది. రైతులను.. అన్నివర్గాల ప్రజలను కాపాడుకున్న కేసీఆర్ను, బీఆర్ఎస్ను కాపాడుకుంటం’ అంటున్నారు రైతులు.. వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ను కాదనుకుంటే నోటికాడి బుక్కను నేలపాలు చేసుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.
నల్లబెల్లి: కాంగ్రెసోళ్ల బాగోతాలు 60 ఏండ్లు చూసిన. కరెంటు లేక, నీళ్లు లేక పంటలు పండకపాయె. తెచ్చిన అప్పులు అట్లనే ఉండేది. సన్న బియ్యం కూడా దొర్కకపోయేది. గిప్పుడు కేసీఆర్ ముసలోళ్ల కట్టాలు తీరుత్తాండు. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ ఇత్తామంటున్నరు. చిన్న మోటర్లు తీసేసి పెద్ద మోటర్లు పెట్టాలెనట. మూడు గంటల కరెంటు ఇత్తే మూడు గజాల జాగ తడుత్తదా? పెద్ద మోటర్లు పెడ్తే కరెంటు చాలుతదా? మోటర్లు కాలిపోతే ఎవడల్లిత్తడు? కాంగ్రెసోళ్ల తాత అల్లిత్తడా? గివీళ్లకు బుద్ధుందా? ఇదివరకే వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు అరిగోస పడ్డం. వాళ్లకు బుద్ధి లేకపోతే మాకు లేదా బుద్ధి. గిలాంటోళ్లను కొసాకిలి కూడా తొక్కనియ్యొద్దు. ఇప్పుడు కేసీఆర్ అన్నం పెడ్తాండు. ఎవుసానికి సరిపోను నీళ్లిత్తాండు. పంట సాయం చేత్తాండు. ముసలోళ్లకు పింఛన్ ఇత్తాండు. మతి తప్పి మాట్లాడుతున్న మందిని ముంచే కాంగ్రెసోళ్లను మేమెందుకు నమ్ముతం. కేసీఆర్ సార్తో ఉంటం. కారు గుర్తుకు ఓటేత్తం.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 29 : ‘సావునోట్లె తల్కాయవెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆరే, తెలంగాణకు ఏంగావాల్నో ఆలోచించి పనులుజేత్తాండు. నాడు పడావువడ్డ ఎవుసాన్ని పచ్చగజేసిండు. కాంగ్రెస్ పాలనల సుక్కనీళ్లు లేక ఎంతేడ్శినం.. నీళ్లు లేక భూములు ఇడిశిపెట్టి ఎంత గోసపడ్డం.. నాడు భూములకు విలువుండెనా? అప్పులు కట్టలేక అడ్డికిపావుశేరు లెక్క అమ్ముకున్నం.. మళ్ల ఆ రోజులు రావద్దు’ అంటున్నారు రైతులు. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ల ఒక్కో నాయకుడు ఒక్కో తీరుగ మాట్లాడుతున్నడని, ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నరు. కేసీఆర్ ఎంతో కష్టపడి ఇంత మంచిగ చేసిన వ్యవసాయాన్ని మళ్లీ పాడుచేసుకోబోమని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడే రైతుల చేతిల్లో నాలుగు పైసలు కనవడుతున్నయని, భూముల ధరలు పెరిగి మొఖం తెలివైందని, రేవుకు వచ్చిన బతుకులను ఆగం చేసుకుంటమా అని అంటున్నరు. కాంగ్రెస్ పాలన అంటే చీకటి రోజులని, వాటిని మళ్లీ తాము కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. వాళ్లు అబద్ధాలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చారని, అక్కడ అమలుకాని హామీలు ఇక్కడ ఎట్ల చేస్తరని ప్రశ్నిస్తున్నరు.
రేవంత్రెడ్డి అంటున్నట్లు మూడు గంటల కరెంటుతోని ఎవుసం ఎట్లజెయ్యాల్నో ఆయనకే తెలువాలె అని ఎద్దేవా చేస్తున్నారు. 10హెచ్పీ మోటర్లు పెట్టి ఎవుసం చేస్తే భూముల నీళ్లు ఆగుతయా అని ప్రశ్నిస్తున్నారు. రెండు, మూడు ఎకరాలున్న రైతులకు 10హెచ్పీ మోటర్లు అవసరమా అని, అంత ఖర్చు ఎవరు పెడుతారని అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితికి 24గంటల కరెంటే మేలని, రైతులు తమకు ఎప్పుడు అవసరం, వీలు ఉంటే అప్పుడు పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారని, ఇప్పుడే ప్రశాంతంగ ఉన్నామని చెబుతున్నారు. ధరణితోని ఏ లొల్లి లేకుండ భూ సమస్యలు తీరుతున్నాయని, దాన్ని తీసేసి కౌలుదారు కాలమ్ పెడితే ఊళ్లలో మళ్లీ రోజూ కొట్లాటలే ఉంటాయని అంటున్నారు. పట్వారీలు, దళారీల రాజ్యం వస్తే రైతులు గోస పడుతారని, ఇప్పుడున్న వ్యవస్థనే బాగుందని చెబుతున్నారు. రైతుల బాగోగులు కోరి పెట్టుబడి సాయం, సబ్సిడీ పనిముట్లు, 24గంటల కరెంటు, పుష్కలంగా సాగునీళ్లు ఇస్తున్న బీఆర్ఎస్ వెంటే తామంతా ఉంటామని కుండబద్దలు కొడుతున్నారు.
కాజీపేట : కాంగ్రేస్ ప్రభుత్వం వస్తే 10 హెచ్పీ మోటర్లంటే చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా భారానికి గురి చేసి నిండా ముంచుడే. తెలంగాణాలో అంతా త్రీ, ఫైవ్ హెచ్పీ మోటర్లతోనే బావుల కాడ వ్యవసాయం నడుస్తుంది. కెనాల్ కాలువలు, వాగులు, కాడ మాత్రమే 10 హెచ్పీ మోటర్లు నడుస్తయ్. 10 హెచ్పీ మోటరు కొని ఎవుసం చేయాలంటే రైతుకు లక్షకు పైగా పెట్టుబడి అవుతుంది. మూడు గంటల కరెంట్ విధానం వచ్చినా, రైతులు ఒక్కసారిగా 10హెచ్పీ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మోటర్లు కాలిపోతాయి. రైతు ఆర్థికంగా ఖర్చుల భారీన పడడం జరుగుతుంది. భూగర్భ జలాలు అడు గంటి పోతాయి. 24 గంటలు ఉచిత కరెంట్, నాణ్యమైన కరెంట్తో బాగా పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులను కాంగ్రెస్ వస్తే రైతు లకు మళ్లీ చీకటి రోజులు రావడం ఖాయం.
పర్వతగిరి : కాంగ్రెస్ పాలనలో రాత్రి పూట కరెంటుతో అనేక కష్టాలు పడిన రైతుల కు సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఇబ్బందులు తీరినయ్. ఉద్యమ సమ యంలో రైతుల ఇబ్బందులు అర్థం చేసుకుని, ముఖ్యమంత్రి కాగానే 24 గంటల కరెంటు ఇచ్చిండు. మళ్లీ కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంటు ఇస్తామని అవగాహన లేకుం డా మాట్లాడున్నరు. 10 హెచ్పీ మోట ర్లు ఇస్తామంటున్నరు. సాధ్యం కాని హామీలతో రైతులు, ప్రజలను దగా చేయడానికే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నరు. రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ధరణి తీసేస్తామనడం కరెక్టు కాదు. రైతుల బాధలు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ సీఎంలకు అర్థం కాదు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల సమస్యలు తీర్చేందుకు అహర్నిశలు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరు. రైతులంతా అవగాహనతో ఉండి బీఆర్ఎస్ను దీవించాలి. కాంగ్రెస్ కుట్రలకు బలి కావద్దు.
హసన్పర్తి : వ్యవసాయానికి 3గంటల కరెంటు ఇస్తే కాల్వల్లో నీళ్లే పారయ్. వ్యవసాయం గురించి తెల్వనోడు మాట్లాడితే తల, తోక లేకుండా ఉంటది. రేవంత్ చెప్పినట్లు 3 గంటల కరెంటు ఇస్తే పశువులకు వేసే మేతను కూడ పండించే పరిస్థితి ఉండదు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాత్రి పూట కరెంటు ఇచ్చి ఎందరో రైతుల్ని కరెంటుషాక్తో పొట్టన బెట్టుకున్నరు. ఇయ్యాల వాళ్లు కరెంటు గురించి మాట్లాడుతాండ్లు. వాళ్ల మాటలు ప్రజలు నమ్మరు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రైతులకు ఉచితంగా 24గంటల కరెంటు ఇచ్చి ఆదుకున్నడు. వారు ఆర్థికంగా ఎదిగేలా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి పండిన పంటకు మద్దతు ధర కల్పించిండు. రైతులను ఆదుకునే వాడు కావాలి కాని రైతుల్ని పొట్టన బెట్టుకునే వాళ్లు మాకెందుకు. ఊళ్లళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తే మీరు ఉన్నప్పుడు ఉచితంగా 24గంటల కరెండు ఎందుకు ఇయ్యలేదని నిలదీసి అడుగుతం.
నల్లబెల్లి: కడుపుకొట్టే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలె. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులతోపాటు అందరం అరిగోస పడ్డం. రైతు గోస తెలిసిన సీఎం కేసీఆర్ సార్ ధరణి పోర్ట ల్ తీసుకువచ్చి భూ సమస్యలకు పరిష్కారం చూ పిండు. పది నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ చేసి మా భూములకు భద్రత కల్పించిండు. ఇప్పుడేమో మతి తప్పిన కాంగ్రెసోళ్లు ధరణిని తీసేత్తామంటే ఊరు కుంటామా? ఒకడేమో మూడుగంటల కరెంటు ఇత్తామంటడు. మరొకడు 10 హెచ్పీ మోటర్లు పెడ్తామంటడు. మూడు గంటల కరెంటుతో దొయ్య పారుతదా.. దోసిలి నిండుతదా? కాంగ్రెసోళ్లు మతి ఉండే మాట్లాడుతున్నారా? మళ్లా రైతుల నోట్లో మట్టి కొట్టాల నుకుంటు న్నారా కాంగ్రెసోళ్లు? కేసీఆర్ సార్ 24గంటల కరెంటు, పంట సాయం చే త్తాండు. నా బిడ్డ పెళ్లికి కల్యా ణలక్ష్మి పైసలు రూ.లక్షా 116 ఇచ్చిం డు. నా ఎకరం భూ మికి యాడాదికి రూ.10వేలు పెట్టుబడి సాయం చేత్తాండు. రైతు బీమా చేసి నా కుటుంబానికి భరోసాని చ్చిండు. అన్ని వర్గాలను ఆదుకుని ఆపద్బాంధువుడైనోడు కేసీఆర్ సార్ ఒక్కడే. కారు గుర్తుకే ఓటేత్తం. కాంగ్రెస్ను ఖతం చేత్తం.
నెక్కొండ: కాంగ్రెస్తో రైతులకు అన్నీ కష్టాలే. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సక్కగ రాలే. పంటలు ఎండిపోతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలే. కరెంట్ లేక, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతన్నలు అరిగోస పడ్డరు. రైతన్నలు విత్తనాల కోసం, ఎరువుల కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డా దొరికేవి కాదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమాతో రైతుల కష్టాలన్నీ తీరాయి. వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. కాంగ్రెస్ ఇప్పుడు మూడు గంటల కరెంట్, కౌలుదారులకు హక్కులంటూ రైతుల మధ్య చిచ్చు పెడుతోంది. కర్షకులను కష్టాల పాలుచేసే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పి బీఆర్ఎస్కు అండగా నిలిచి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలి.
నర్సంపేట రూరల్: ధరణి పోర్టల్తో రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. గతంలో ఏండ్లకొద్ది భూమి రికార్డులు సరిగా లేక ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఆగమయ్యాం. ఇప్పుడు కాంగ్రెస్ ధరణి తీసేస్తామంటే ఊరుకునేది లేదు. ధరణి తీసేస్తే మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తది. దీంతో రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తది. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి ప్రతి రైతుకు పట్టాదారు పాస్పుస్తకాలను అందించారు. అంత మంచిగ ఉన్నదాన్ని రద్దు చేస్తమని కాంగ్రెస్ అనడం సరికాదు.
హనుమకొండ సబర్బన్ : అనేక సంవత్సరాలుగాఎన్నో ప్రభు త్వాలు వచ్చినయ్,పోయినయ్ కానీ భూముల సమస్యలు మాత్రం అట్లనే ఉన్నయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడు కూడా భూముల పట్టాలపై దృష్టి పెట్టలేదు. కేసీఆ ర్ ముఖ్యమంత్రి అయినంకనే భూములపై నజర్ పెట్టిండు. ధరణి వచ్చినంక భూ ము ల పట్టాలు అయినయ్. ఇప్పుడు తహ సీల్దార్ ఆఫీసుకి పోయి ఇట్లా వేలి ముద్ర వేస్తేనే భూములు ఇతరులకు మారుతు న్నాయి. అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ధరణి తీసేత్తమని చెప్తున్నరు. ఇట్లా అయితే మళ్లీ పాత లేక్కనే దోసుకునుడు మొదలు అయితది.
నర్సంపేట రూరల్: ధరణితో దళారుల దందా బంద్ అయ్యింది. ధరణి వచ్చిన తర్వాత మోసాలు జరగడం లేదు. భూ రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఒకరి భూమి ని మరొకరు ఎక్కించుకునే వీలు లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతుల తిప్పలు మళ్లీ షురూ అవుతాయి. గతంలో భూముల వివరాలు తెలుసుకోవాలంటే రెవెన్యూ అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభు త్వంలో ధరణి పోర్టల్తో రైతులకు తిప్పలు తప్పాయి.
పర్వతగిరి : ధరణి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్తోనే రైతులకు భూములపై భద్రత పెరిగింది. గతంలో ధరణి లేనప్పుడు రైతులకు తగాదాలు ఉండేవి. ఇప్పుడు ధరణి వచ్చినంక సమస్యలు తగ్గిపోయినవి. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. రైతుల కష్టాలు తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు రైతులకు 3 గంటల కరెంటు చాలు అని చెప్పడం సబబు కాదు. 10 హెచ్పీ మోటర్లు పెడుతామని చెబుతున్న కాంగ్రెస్ నాయకుల మాటలు ఎవరూ నమ్మరు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాత్రి పూట కరెంటుతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. కరెంటు షాక్, విషపురుగుల కాటుతో మృతిచెందిన వారు అనేకమంది ఉన్నారు. మళ్లీ 3 గంటల కరెంటు ఇస్తామని చెబుతున్న వారిని రైతులు విశ్వసించరు. తెలంగాణలో అన్నదాతకు అన్ని విధాలా సాయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని రైతులంతా అనుకున్నం. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నరు. రైతులకు మళ్లీ కష్టాలు మొదలైతయ్. అందుకే బీఆర్ఎస్కే ఓటు వేస్తాం.