75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెండా పండుగ అంబరాన్నంటేలా జరిపేందుకు అధికారులు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10:30గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడంతోపాటు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
మహబూబాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంబరాన్నంటేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు, విద్యార్థుల నృత్యాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానించనున్నారు. అనంతరం ముఖ్యఅతిథులు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రా లు అందజేత, స్టాళ్ల సందర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాల ప్రదర్శించనున్నాయి.
సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. వేడుకలు నిర్వహించే ఎన్టీఆర్ మైదానంలోకి ప్రముఖుల వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న మంత్రి సత్యవతిరాథోడ్తోపాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, డీఎస్ రెడ్యానాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్రపవార్ వాహనాలు మాత్రమే మైదానంలోకి అనుమతిస్తారు. మిగతా జిల్లా అధికారులు, ఇతర రాజకీయ నాయకుల వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. వీఐపీ, స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రెస్, పోలీసులు, ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల్లో భాగంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను ఘనంగా సన్మానించనునున్నారు.
కార్యక్రమాల వివరాలు..
సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యఅతిథి మంత్రి సత్యవతిరాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 10.40 గంటలకు ప్రసంగం, 11 గంటలకు స్వాతంత్య్ర సమయోధులకు సన్మానం, 11.10 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు, 11.30 గంటలకు శకటాల ప్రదర్శన, 11.40 గంటలకు అవార్డుల ప్రదానం, మధ్యాహ్నం 12.15 గంటలకు వివిధ శాఖల స్టాల్స్ సందర్శన ఉంటుంది. ఆదివారం ఉదయం నుంచి సా యంత్రం వరకు వర్షం పడటంతో స్టేడియమంతా పచ్చి గా మారింది. సోమవారం ఉదయం కూడా ఇలానే ఉం టే కార్యక్రమాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.