స్వాతంత్య్ర వేడుకలు మంగళవారం అంబరాన్నంటాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం కాలనీల్లో, ఊరూరా, వాడవాడలా ఘనంగా నిర్వహించారు. హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ ఐడీఓసీ మైదానంలో జరిగిన వేడుకల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్యఅతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం జిల్లాల్లో సాధించిన ప్రగతిపై ప్రసంగిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– వరంగల్/ఖిలావరంగల్, ఆగస్టు 15
త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురం అంబరాన్నంటింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలిపేలా శకటాలను ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో ముఖ్య అతిథులు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య ఉన్నారు. మహబూబాబాద్లో మంత్రి సత్యవతిరాథోడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సెల్యూట్ చేశారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు. హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి వేడుకలను తిలకించగా, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి చీఫ్ విప్ ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా వేడుకలను తిలకించారు. ములుగులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. వరంగల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 15