వరంగల్, సెప్టెంబర్ 30(నమస్తేతెలంగాణ) : రెండో విడుత దళితబంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే మరోవైపు ఎంపికైన వారికి యూనిట్లను పంపిణీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నది. ఒక్కో లబ్దిదారు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తున్నది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కొంతమంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ సదస్సులను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మొదట పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుగొండ, సంగెం మండలాలు, జీడబ్ల్యూఎంసీకి చెందిన 15, 16, 17 డివిజన్లలో సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, తొలివిడుత 303 మందికి రూ.30.30 కోట్ల విలువైన యూనిట్లను ప్రభుత్వం అందజేసింది. వీటి నిర్వహణతో లబ్ధిదారులు ఆదాయం పొందుతున్నారు.
గతంలో గుమస్తా, డ్రైవర్, కూలీగా పనిచేసిన తాము దళితబంధు పథకంతో ఓనర్లుగా మారామని చాలా మంది మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం ద్వారా రెండోవిడుత 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,100 యూనిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో రెండోవిడుత పథకం అమలుపై స్పెషల్ ఆఫీసర్స్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఈ మేరకు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు దళితబంధు సెల్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. వీటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల జాబితాలను రూపొందించారు. కొద్ది రోజుల క్రితం ఈ జాబితా నుంచి లబ్ధిదారులను ఎంపిక మొదలైంది. ఇప్పటికే కొన్ని మండలాలు, జీడబ్ల్యూఎంసీ డివిజన్లలో పూర్తయింది. పలు చోట్ల కొనసాగుతోంది. ఎంపికైన వారి పేర బ్యాంకుల్లో అధికారులు ఖాతాలను తెరుస్తున్నారు. గురువారం జిల్లాలో దళితబంధు పథకం ద్వారా రెండోవిడుత యూనిట్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు లాంఛనంగా ప్రారంభించారు. నర్సంపేటలో మొదట 20 మందికి యూనిట్ల మంజూరు పత్రాలను అందజేశారు.
అవగాహన సదస్సులకు ప్లాన్..
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం జిల్లాకు 3,421 యూనిట్లను కేటాయించింది. నర్సంపేట, వరంగల్తూర్పు నియోజకవర్గానికి చెందినవి 2,200 యూనిట్లు కాగా రాయపర్తి మండలానివి 144, గీసుగొండ, సంగెం మండలాలతో పాటు 15, 16, 17 డివిజన్లకు చెందినవి కలిపి 477, వర్ధన్నపేట, పర్వతగిరితో పాటు జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని జీడబ్ల్యూఎంసీ డివిజన్లవి 600 యూనిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గీసుగొండ, సంగెం మండలాలతో పాటు జీడబ్ల్యూఎంసీకి చెందిన 15, 16, 17 డివిజన్లలో దళితబంధు పథకం యూనిట్ల కోసం 477 మంది ఎంపిక జరిగింది. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో కూడా ఎనభై శాతం లబ్దిదారుల ఎంపిక జరిగినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
రాయపర్తి మండలంలో 144 యూనిట్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇతర మండలాలు, జీడబ్ల్యూఎంసీ డివిజన్లలో తుది దశకు చేరినట్లు తెలిసింది. దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులు యూనిట్లను సెలక్ట్ చేసుకోవడానికి అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. పరకాల నియోజకవర్గం, జీడబ్ల్యూఎంసీలో ఎంపికైన 477 మందికి ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని 1,100 మంది దళితబంధు లబ్దిదారులకు అక్టోబర్ 6 లేదా 7న నర్సంపేటలో అవగాహన సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అవగాహన సదస్సుల అనంతరం అధికారులు లబ్ధిదారులు సెలక్ట్ చేసుకున్న యూనిట్లను కొనుగోలు చేసి పంపిణీ చేస్తారు.