వరంగల్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మరికొన్ని గంటల్లో 2022 కాలగర్భంలో కలిసిపోనున్నది.. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకు వేదికైంది. ఎన్నో ఆశలతో మొదలైన ఈ ఏడు కొన్నింటిని నెరవేర్చి, మరికొన్నింటిని వాయిదా వేస్తూ గడిచిపోయింది. కొంగొత్త ఆశలతో మరో నూతన సంవత్సరం మొదలవుతున్నది. మరింత నిత్యనూతనంగా, అందరికీ నచ్చేలా కొత్త ఏడాది ఉండాలని ఆకాంక్షిస్తూ.. గడుస్తున్న ఏడాది వేసిన కొన్ని ముద్రలను గుర్తు చేస్తూ..!
టీఆర్ఎస్కు సారథులు
తెలంగాణ రాష్ట్ర సమితికి జనవరి 26న జిల్లా సారథులు నియమితులయ్యారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అరూరి రమేశ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపీ కవిత, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జనగామ జిల్లా అధ్యక్షుడిగా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడిగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్కు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రెండు చోట్ల మహిళలను పార్టీ చీఫ్గా నియమించారు. రెండు జిల్లాల్లో బీసీలకు, రెండు జిల్లాల్లో ఓసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో జిల్లాలో పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించారు.
గ్రేటర్లో కేటీఆర్ ప్రగతిబాటలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.188 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఏప్రిల్ 20న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్ మహానగరంలో కొత్తగా నిర్మించిన, సమకూరిన వసతులను ప్రారంభించారు. జీడబ్ల్యూఎంసీ రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన రెండు స్వర్గరథాలు, రూ.36 లక్షలతో 66 ఫాగింగ్ మిషన్లు, జీడబ్ల్యూఎంసీ నుంచి భద్రకాళీ జంక్షన్ వరకు రూ.7 కోట్లతో నిర్మించిన స్మార్ట్రోడ్డు-4ను, అలంకార్ బ్రిడ్జి దర్గా నుంచి కాపువాడ రోడ్డును కలుపుతూ నిర్మించిన స్మార్ట్రోడ్డు-3ని, రూ.12 కోట్లతో ఆధునీకరించిన పబ్లిక్ గార్డెన్ను, రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన రీజినల్ లైబ్రరీని ప్రారంభించారు. 14 అభివృద్ధి పనులకు ఒకేచోట శంకుస్థాపన చేశారు. స్మార్ట్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారితో ముచ్చటించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశంలో ప్రసంగించారు.
టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గణేశా ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను పరిశ్రమల మంత్రి కే తారకరామారావు మే 7న ప్రారంభించారు. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న కిటెక్స్ అప్పారెల్ పార్కు లిమిటెడ్, యంగ్ వన్ కార్పొరేషన్ యూనిట్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్లతో చేపట్టిన కిటెక్స్ యూనిట్ కార్యకలాపాలు మొదలైతే 1500 మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు.
మేడారానికి జన‘కోటి’
వన దేవతలను పూజించే మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరిగింది. కోటి మందికిపైగా భక్తులు తలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా ఉధృతి తగ్గడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చి వెళ్లారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లతో ఏర్పాట్లు చేసింది. వైద్య సేవల కోసం పకడ్బందీగా చర్యలు చేపట్టింది.
ములుగు నుంచే హెల్త్ ప్రొఫైల్
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్తో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు మార్చి 5న ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. పలువురికి ఈ-హెల్త్ కార్డులను అందించారు. ములుగు జిల్లా కేంద్రంలో 250 పడకల వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన రేడియాలజీ ల్యాబ్ను ప్రారంభించారు. పరకాలలో 100 పడకల వైద్యశాల.. నర్సంపేటలో 250 పడకల వైద్యశాల, టీ డయాగ్నస్టిక్ సెంటర్, 15 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వెటరన్ అథ్లెటిక్స్కు వేదిక
తెలంగాణ రాష్ట్ర 8వ వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్చి 26న ఈ పోటీలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. 95 ప్లస్ వెటరన్ అథ్లెట్ కత్తెరశాల కొమురయ్య (5కే రన్లో గోల్డ్మెడల్), 90 ప్లస్లో లాంగ్జంప్, షాట్పుట్లో గోల్డ్మెడల్ సాధించిన బీ శ్రీనివాస్రెడ్డిని సన్మానించారు.
ఓరుగల్లుకు ప్రపంచ స్థాయి గుర్తింపు
చారిత్రక వరంగల్ నగరం మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. అంతర్జాతీయ స్థాయి నగరంగా గుర్తింపు పొందింది. స్థిరమైన పట్టణాభివృద్ధి వనరుల సమీకరణ వ్యూహానికి యునెస్కో సెప్టెంబరు 8న ఈ గుర్తింపునిచ్చింది. వేగవంతమైన అభివృద్ధికి నిర్దిష్ట వ్యూహాలను అమలు చేసే ప్రక్రియలో స్థానిక సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు యునెస్కో ఇనిస్టిట్యూట్ ఫర్ లైఫ్లాంగ్ లెర్నింగ్ సంస్థ గ్లోబల్ నెట్ వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ను స్థాపించింది. దీనిలో చోటు దక్కిన నగరాలకు స్థిరమైన అభివృద్ధి, వనరుల సమీకరణలకు మద్దతు ఇస్తున్నది
వరద ప్రాంతాలకు సీఎం కేసీఆర్
గోదావరి తీర ప్రాంతంలో అధిక వానలతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై 16న వరంగల్ నగరానికి వచ్చారు. జూలై 17న పొద్దున హనుమకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి భద్రాచలం పర్యటనకు వెళ్లారు. అక్కడి వరద ప్రాంతాల్లో పర్యటన అనంతరం హెలికాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకున్నారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సారె సమర్పించి, శాంతి పూజలు చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి మూడు కిలో మీటర్లు నడిచి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి, అకడి పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన సీఎం
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అక్టోబర్ 1న పరిశీలించారు. పనుల పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.వరంగల్ నగర పరిధి ములుగు రోడ్డులో ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను సీఎం కేసీఆర్ ఇదే రోజు ప్రారంభించారు.
వైభవంగా కాకతీయ సప్తాహం
ఓరుగల్లు చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం జూలై 7న ఘనంగా మొదలైంది. వేడుకులకు ముఖ్యఅతిథిగా ఛత్తీస్గఢ్లోని బస్తర్కు చెందిన కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ వరంగల్ నగరానికి వచ్చారు. కాకతీయుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్లోని పోచమ్మమైదాన్ జంక్షన్లో ఉన్న రాణిరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. కాకతీయ రాజధాని కేంద్రం ఖిలా వరంగల్ను సందర్శించారు. స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేయి స్తంభాల ఆలయం, అగ్గలయ్య గుట్టను సందర్శించారు. కాకతీయ పాలకుల స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పుణరుద్ధరణ చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందన్నారు.
మానుకోటలో వైద్యశకం
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో కొత్త శకం మొదలుపెట్టింది. గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. ఆధునిక వైద్య సేవలను, వైద్య విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15న మహబూబాబాద్లో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో మెడికల్ కాలేజీ క్లాసులను ప్రారంభించారు.
కొత్త మండలాలు
ప్రజలకు పరిపాలనను దగ్గర చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తి, సీరోలు గ్రామాలను మండల కేంద్రాలుగా మారుస్తూ సెప్టెంబర్ 25న ఉత్తర్వులు ఇచ్చింది.
భద్రకాళికి మాడ వీధులు
భద్రకాళీ అమ్మవారి ఆలయ మాడ వీధుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 4న రూ.20 కోట్లు మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఈ మొత్తాన్ని కేటాయించింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నుంచి మరో రూ.10కోట్లను దీనికి కేటాయించారు. మొత్తం రూ.30 కోట్లతో భద్రకాళీ ఆలయ మాడ వీధుల నిర్మాణం పూర్తి చేయనున్నారు.
నోబుల్ గ్రహీత కైలాష్ సత్యార్థి రాక
నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి డిసెంబర్ 18, 19న వరంగల్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి వరంగల్-హనుమకొండ జిల్లాల కోర్టు భవనాన్ని సందర్శించారు.వరంగల్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలోని పోక్సో, ఫ్యామిలీ కోర్టు దేశంలోనే మోడల్గా ఉన్నాయని పేర్కొన్నారు. ‘చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ బ్లెండ్ ఆఫ్ నేచర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 50 వేల మంది స్కూల్ పిల్లలతో నిర్వహించిన భారీ బహిరంగసభలో కైలాస్ సత్యార్థి ప్రసంగించారు.
రామప్పకు వచ్చిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబర్ 28న ప్రసిద్ధ రామప్ప ఆలయానికి వచ్చారు. యునెస్కో గుర్తించిన రామప్పను భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే మొదటిసారి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము నిలిచారు. రామప్ప ఆలయంలోని రుద్రేశ్వరస్వామికి రాష్ట్రపతి పూజలు చేశారు. ప్రసాద్ పథకం కింద రామప్ప ఆలయం, ఆవరణలో చేపట్టనున్న రూ.75 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడి కామేశ్వర ఆలయ పనరుద్ధరణ పనులను ప్రారంభించారు.