హనుమకొండ, మే 24 : హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైస్ మిల్లర్లే అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల పేరిట జరుగుతున్న అవినీతి దందా, ధాన్యం షార్ట్ఫాల్ ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ అక్రమ వ్యవహారాన్ని బయటకు రాకుండా సంబంధిత అధికారులు కప్పిపుచ్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం జిల్లాలోని రైస్ మిల్లలకు తనిఖీకి వెళ్లిన సివిల్ సప్లయ్స్ అధికారులు సుమారు రూ. 1.30 కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అయితే అప్పటి నుంచి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. షార్ట్ఫాల్ వచ్చినప్పటికీ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఉన్నతాధికారిని మచ్చిక చేసుకొని అక్రమ దందా నడిపిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులే మళ్లీ అవినీతి వ్యవహారం నడుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతున్నది.
ఒక్క మిల్లులోనే..
గత మార్చిలో పరకాల డివిజన్ పరిధి శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని ఓ మిల్లును అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 2024-25 యాసంగికి సంబంధించి 13 వేల బస్తాల (రూ.1.30 కోట్ల విలువ చేసే 5,200 క్వింటాళ్లు) ధాన్యం షార్ట్ ఫాల్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే 2025-26 వాన కాలానికి సంబంధించి 2,107 టన్నుల ధాన్యం ఇవ్వగా ఈ నెల 22 వరకు కేవలం 8 శాతం సీఎంఆర్ పెట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో అధికారులు మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సదరు మిల్లు యజమానితో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం మేరకే చర్యలు తీసుకోవడం లేదనే చర్చ రైస్ మిల్లర్లలో సాగుతున్నది.
అంతేకాక తనకు అనుకూలంగా ఉన్న మిల్లర్ల విషయంలో చూసీ చూడనట్లు, మిగిలిన వారి విషయంలో జిల్లా అధికారి కఠినంగా వ్యవహరిస్తున్నాడని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయమై జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అధికారిక సెల్ఫోన్ పనిచేయడం లేదు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవిని ఫోన్లో విచారించగా ధాన్యం షార్ట్ ఫాల్ విషయం తన దృష్టికి రాలేదని, డీసీఎస్వో నివేదిక ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, కలెక్టర్, అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపడితే విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని కొందరు మిల్లర్లు చెప్పడం విశేషం.