జనగామ, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం మాటలు నమ్మిన రైతులు అటు మార్కెట్ యార్డులు.. ఇటు ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూడాల్సివస్తున్నది. వారంరోజుల క్రితం జిల్లావ్యాప్తంగా 319 ప్రాంతాల్లో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు ఐకేపీ నిర్వాహకులు కన్నెత్తి చూసింది లేదు.
కొనేవాళ్లు దిక్కులేక ఇటు ధాన్యం, అటు మక్కజొన్న రాశుల వద్ద ప్రతిరోజూ పిల్లా, పాపలతో సద్దులు కట్టుకొని వచ్చి పడిగాపులు కాయాల్సిన దీన్యస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నీ సమకూర్చుకోకుండానే హడావుడి అధికార ఆర్భాటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మార్కెట్ చైర్మన్లు, అధికార పార్టీ నాయకులు, అధికారులు రిబ్బన్ కటింగ్ చేసి.. కొబ్బరికాయలు కొట్టి.. మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని బీరాలు పలికి వెళ్లారు. వందల, వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చిన రైతులకు వారం రోజులుగా ఎదురుచూపులు..పడిగాపులు తప్పడంలేదు.
కాంటాలు(తూకం యంత్రాలు) లేవని.., గన్నీలు (సంచులు) రాలేదని.., హమాలీల కొరత ఉందని.., రవాణా చేసేందుకు లారీలు లేవని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు కుంటిసాకులు చెబుతున్నారు. తెచ్చిన ధాన్యం కుప్పలు పోసి వారం గడుస్తున్నది. ఎండకు ఎండి తూకం తగ్గిపోతున్నది. మాకు వచ్చే నష్టాన్ని ఎవరు భరిస్తారు..? దీనికెవరు బాధ్యులు అంటూ రైతు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు.
కాంగ్రెస్ పాలనలో రైతుకు మద్దతు ధర దక్కడం మిథ్యే అని తేలింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ఏడాది ఇదే సీజన్లో రెండు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి దొడ్డు, సన్న ధాన్యం కొనుగోలు చేశారు. ఈసారి కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై స్పష్టత లేకున్నా గత సీజన్ మాదిరిగానే మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయని రైతులు ధాన్యం తెచ్చి యార్డులో ఆరబోసుకున్నారు. 15 రోజులుగా ధాన్యం రాశులు కుప్పలు.. తెప్పలుగా పేరుకుపోయాయి.
కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో కాటన్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన దాదాపు 50వేల బస్తాల ధాన్యం నిల్వలు కదలకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన తీరుకు అద్దం పడుతున్నది. ఇన్ని రోజులు ఎదురుచూసి మా వడ్లు ఎప్పుడు కొం టారని ఐకేపీ నిర్వాహకులను నిలదీస్తే.. మూడు రో జుల క్రితం కేంద్రానికి వచ్చి పేర్లు, ఊర్లు, పండిన ధాన్యం ఎంత? అనే వివరాలు రాసుకొని వెళ్లి ఇప్పటి వరకు జాడలేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజులతరబడి వేచిచూసి కొందరు రైతులు యార్డులోనే ప్రైవేట్ ట్రేడర్లు, లేదంటే రైస్ మిల్లులకు తరలించి ఎంతోకొంతకు అమ్ముకుంటున్నారు.
జనగామ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థ కొనుగోళ్ల కోసం వారం, పది రోజులుగా ధాన్యం రాశుల వద్ద రైతులు ఇంటిల్లీపాది పడిగాపులు కాస్తున్నా.. కొనే నాథుడు లేకపోవడంతో ప్రైవేట్ ట్రేడర్ల వద్ద క్వింటాల్కు రూ.1,650 నుంచి రూ.1,750, రూ.1,770, రూ.1,780, రూ.1,800 ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. యార్డులో ధాన్యం కుప్ప పక్కనే మరో కుప్ప పోయడంతో బూజుపట్టి ధాన్యం రంగుమారుతున్నది. ధాన్యం ఆరబెట్టుకునే జాగలేక లోపల తేమతో బూజుపట్టి మక్కిపోతున్నా యి. పూర్తిగా రంగుమారితే క్వింటాలుకు రూ.వెయ్యి కూడా దక్కే పరిస్థితి లేదని భావించి తక్కువ ధర ట్రైడర్లకు అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు.
‘అయ్యా..ఐకేపీ ఆధ్వర్యంలో అధికారులు వచ్చారు..పూల దండలు వేశారు..కొబ్బరికాయ కొట్టి సెంటర్ తెరిచామని ఫొటోలు దిగి వెళ్లిపోయారు..కానీ, ఇకడ మా పరిస్థితి ఏంటి? తెచ్చిన ధాన్యం కుప్పలు పోసి మూడు రోజులైంది..అడిగితే కాంటాలు (తూకం యంత్రాలు) రాలేదు..గన్నీ బ్యాగులు లేవు..హమాలీలు లేరు అని చెబుతున్నారు..ప్రారంభించిన రోజే ఇవన్నీ ఉండాలి కదా? ఎండకు ధాన్యం ఎండిపోయి తూకం తగ్గిపోతోంది..దీనికి బాధ్యులు ఎవరు?..రైతుకు వచ్చే నష్టం ఎవరు భరిస్తారు’?.
– బొల్లి కొమురయ్య, కొడకండ్ల, రైతు
‘ఆకాశం వైపు చూస్తే గుండె జారిపోతోంది.. ఏ క్షణాన అకాల వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. తూకం వేయక, పట్టాలు (టార్పాలిన్లు) సరిగ్గా లేక ధాన్యం తడిసిపోతే మా గతేం కావాలి’..? తడిసిన ధాన్యాన్ని కొంటారో కొనరో అనే భయంతో రాత్రిపూట నిద్రరావడం లేదు..ఆఫీసర్లు వెంటనే వచ్చి కంటాలు పెట్టి ధాన్యం కాంటా వేయించాలి..మేము కోరేది ఒకటే..రిబ్బన్ కటింగ్లు కాదు, మాకు కావాల్సింది ముందు ధాన్యం తూకం..గిట్టుబాటు ధర అంటరా అది దేవుడెరుగు..ముందు తూకం వేసి మిల్లులకు పంపిస్తే మా పానాలు కుదుటపడతాయ్..లేదంటే రోడ్డెకడం తప్ప మాకు వేరే దారి లేదు.
– ధరావత్ కోట, రైతు-కడగుట్టతండ, కొడకండ్ల మండలం