సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు. మిల్లుల యజమానులు 8,692 టన్నుల బియ్యాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారని, బియ్యం విలువ సుమారు రూ.30.76 కోట్లు ఉంటుందని అందులో పేర్కొన్నారు. నివేదికలోని వివరాల ఆధారంగా ప్రభుత్వం ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, అధికారులు వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సొమ్ము రాబట్టేందుకు ఆర్ఆర్ యాక్టును ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు.
– వరంగల్, మే 14(నమస్తేతెలంగాణ)
వరంగల్, మే 14 (నమస్తే తెలంగాణ) : రైస్మిల్లర్లు కొందరు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. వీరిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జిల్లాలో పన్నెండు రైస్మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) యాక్టును ప్రయోగించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఈ రైస్మిల్లులకు ప్రస్తుత యాసంగి ధాన్యం కేటాయించలేదు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. ధాన్యాన్ని సీఎంఆర్ విధానంపై రైస్మిల్లులకు కేటాయిస్తున్నది. సదరు రైస్మిల్లర్లు దీన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.
రైస్మిల్లర్లకు ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలను చెల్లిస్తున్నది. 2021-22లో జిల్లాలోని 12 మిల్లుల యజమానులు సుమారు 8,692 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. క్వింటాల్ బియ్యానికి ప్రభుత్వ ధర రూ.3,540 చొప్పున సీఎంఆర్ విలువ సుమారు రూ.30.76 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. సీఎంఆర్ డెలివరీ చేయాలని పలుమార్లు రైస్మిల్లుల యజమానులకు నోటీసులను జారీ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయా రైస్మిల్లుల యజమానులతో మాట్లాడారు. అయినా ఫలితం కనబడకపోవడంతో ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినా సీఎంఆర్ డెలివరీ చేయడానికి ససేమిరా అన్నారు. దీంతో ప్రభుత్వం వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
కేసులు నమోదు..
నర్సంపేట ద్వారకపేటలోని ఎంఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీస్, మహేశ్వరంలోని శ్రీ తారకప్రభు ఇండస్ట్రీస్, పర్వతగిరి మండలం రావూరులోని శ్రీ వెంకటేశ్వర బిన్ని రైస్మిల్, చౌటపల్లిలోని దేవీధనలక్ష్మి బీఆర్ఎం, కల్లెడలోని శ్రీ రాజరాజేశ్వరి బీఆర్ఎం, దౌలత్నగర్లోని పరమేశ్వర బిన్ని రైస్మిల్, ఏనుగల్లులోని మహేశ్వర బీఆర్ఎం, పర్వతగిరిలోని విజయలక్ష్మి బిన్ని రైస్మిల్, చింతనెక్కొండలోని వెంగమాంబ రైస్ ఇండస్ట్రీస్, రాయపర్తి మండల కేంద్రంలోని రోహిణి బిన్ని రైస్మిల్, నెక్కొండ వాగ్యానాయక్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్, ఖిలావరంగల్లోని శివగణపతి ఇండస్ట్రీస్ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
అత్యధికంగా ద్వారకపేటలోని ఎంఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీస్ నుంచి 3,017 టన్నులు, రావూర్లోని శ్రీ వెంకటేశ్వర బిన్ని రైస్మిల్ నుంచి 1,260, వాగ్యానాయక్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి రైస్మిల్ నుంచి 1,170, ఏనుగల్లోని మహేశ్వర బీఆర్ఎం నుంచి 835 టన్నుల సీఎంఆర్ డెలివరీ కావాల్సి ఉంది. 12 రైస్మిల్లుల నుంచి డెలివరీ కావాల్సిన 8,692 టన్నుల సీఎంఆర్కు సంబంధించిన ధాన్యం మాయం కావడంపైనా విమర్శలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదుతో రైస్మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మిల్లులకు ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కేటాయించలేదు. ఆర్ఆర్ యాక్టు కింద మిల్లుల ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రాబట్టే దిశగా పౌరసరఫరాల శాఖ అధికారులు కదులుతున్నారు. సాధ్యమైనంత త్వరలో ఆర్ఆర్ యాక్టును అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.