అయోధ్య, ఆగస్టు 18: అయోధ్యలో రామ మందిరంలో విరాళాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నిరపరాధిగా తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదికను ఉత్తర్ ప్రదేశ్ హోం శాఖ అధ్యయనం చేస్తున్నదని క్షేత్ర ట్రస్టుకు అందచేస్తుందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
విరాళాలు చోరీ ఆరోపణలపై విచారణ జరుగుతుండటంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇద్దరు జూన్లో ట్రస్టులోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి మొదటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన రెండవ సిట్ ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 16 మంది అభ్యర్థులు షార్ట్లిస్ట్ అయ్యారు. ఈనెల 11, 12 తేదీలలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. జస్టిస్(రిటైర్డ్) ఫెర్మోడ్ కోహ్లి, లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) వీకే చతుర్వేది, అణు శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ హవ్రేలతో కూడిన సెర్చ్ కమిటీ కీలకమైన సంస్థాగత నాయకత్వ పదవికి అభ్యర్థులను మూల్యాంకనం చేసింది.