న్యూఢిల్లీ, ఆగస్టు 18: మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీలను ఉరి తీసే ప్రస్తుత పద్ధతిని రద్దు చేసి, దాని స్థానంలో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం వంటి తక్కువ బాధాకరమైన పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. అయితే ఒక నిపుణుల కమిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న మరణశిక్ష అమలు పద్ధతిపై సమగ్ర సమీక్ష చేపట్టకుండా తమ తీర్పు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోలేదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీ గౌరవాన్ని కాపాడుతూనే అనవసరమైన బాధను తగ్గించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతి మెరుగ్గా నెరవేరుస్తుందేమో అటువంటి సమీక్ష ద్వారా పరిశీలించవచ్చని కోర్టు తెలిపింది. ఉరి తీసే పద్ధతిని చట్టం నుంచి తొలగించాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.