సుబేదారి, జూలై 29 : అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హనుమకొండ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య వక్తగా పోలీస్ కమిషనర్ తరుణ్జోషి హాజరై మాట్లాడారు. సైబర్ నేరస్తులపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, బ్లూ కలర్ లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ క్లిక్ చేస్తే వ్యక్తి గత సమాచారం, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తారని సీపీ అన్నారు. నెట్ బ్రౌజింగ్ సమయంలో వచ్చే నోటిఫికేషన్లపై వెంటనే స్పందించకూడదని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు, కారు గెల్చుకున్నారు అని మెసేజ్లు వస్తే స్పందించకూడదని అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా పోయిన డబ్బులు తిరిగి వస్తాయని సీపీ చెప్పారు.
డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి..
బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని సీపీ తరుణ్జోషి అన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. అజాగ్రత్తగా ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సీపీ కోరారు.
భవిష్యత్ను పాడు చేసుకోవద్దు..
యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను పాడుచేసుకోవద్దు, మత్తుకు దూరంగా ఉండాలని సీపీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా, విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని చెప్పారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీపీ పేర్కొన్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
సీనీ నటుడు శివారెడ్డి, జబర్దస్త్ ఫేం వెంకీ మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. స్థానిక కళాకారుల పేరిణి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదస్సులో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్, సుబేదారి, కేయూసీ, హనుమకొండ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్, శ్రీనివాస్జీ పాల్గొన్నారు.