ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించే వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సింది మృధుభాషణం, హూందాతనం. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఇందులో ఏ ఒక్క అర్హతా లేదు. మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అల్లాటప్పాగా మాట్లాడటం ఆయన ధోరణి. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అడ్డగోలుగా నోరుపారేసుకోవడం ఆయనకున్న మరో ప్రత్యేకత. ఈ రెండు ప్రత్యేకతలే ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవి ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ఆయనకు తెలిసిందల్లా కేసీఆర్పై అవాకులూ చవాకులూ పేలడం మాత్రమే. పొద్దున లేస్తే ఆయన కేసీఆర్ నామజపం చేయకుండా ఉండలేడు. ఎంతగా అంటే సభ్యసమాజం అసహ్యించుకునేలా మాట్లాడటంలో ఆయన ఆరితేరారు. ఆయనకు తెలిసిన రాజకీయం ఇదే అని సరిపెట్టుకోవాలా? అర్థం కాదు. తాజాగా పిల్లలు, వాళ్ల చదువులపై పడ్డారు. విధానపరంగా కీలకమైన అంశాల మీద మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం అవసరం. కానీ ఈ లక్షణం రేవంత్లో ఏ కోశానా కనిపించదు. ఇంజినీరింగ్ చదువులు ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఈ ధోరణికి పరాకాష్ఠ. అలా నోరు పారేసుకోవడం అర్థరహితమైందే కాకుండా, అనర్థదాయకమైంది కూడా.
ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఇంజినీరింగ్ విద్యకున్న స్థానం తెలిసిందే. సమాజాభివృద్ధిలో వృత్తివిద్యా ప్రాముఖ్యం పెరుగడమే అందుకు కారణం. అదే సమయంలో తామరతంపరగా పుట్టుకువచ్చిన ఇంజినీరింగ్ కళాశాలల వల్ల నాణ్యత కొంతమేరకు పడిపోవడం సహజమే. అయితే దానిని చక్కదిద్దాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి పైనే ఉన్నది. ఆ పని చేయకుండా మొత్తంగా ఇంజినీంగ్ విద్యనే వ్యర్థం అనడం ‘ఆడలేక మద్దెల ఓడు’గానే భావించాలి. ఎన్నికలకు ముందు ఊరించిన ఉద్యోగాలు కల్పనగానే మిగిలిపోయాయి. అది చాలక ఇప్పుడు చదువులను భ్రష్టుపట్టించే మాటలు మాట్లాడుతుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తూ బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న రేవంత్ ఇప్పుడు మొత్తాలన్నింటికీ ఎగనామం పెట్టాలని చూస్తున్నారా? అనేది ప్రశ్న.
ఇది కేవలం విద్యా చర్చ కాదు, ఇది యువత భవిష్యత్తుతో ఆడుకునే అంశం. పోనీ సీఎం ఏదైనా ప్రత్యామ్నాయం సూచించారా? అంటే అదీ లేదు. గాలివాటంగా ఓ మాట అనేయగానే సరిపోదు. ఇంజినీరింగ్ విద్య వల్ల సమాజంలో కలిగిన మార్పులను తెలియనివారే తేలికగా మాట్లాడగలరు. ఇంజినీరింగ్ చదివిన తెలంగాణ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో ఉన్నత పదవులకు ఎదిగారు. స్టార్టప్లు పెట్టి రాకెట్లు ఎగరేస్తున్నారు. ఒకవైపు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తామని, గ్లోబల్ కంపెనీలను తీసుకువస్తామని గొప్పలు చెప్పుకొంటూ, మరోవైపు ఇంజినీరింగ్ చదువుల విలువను తగ్గించే వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ ద్వంద్వ వైఖరి పాలనలో స్పష్టమైన దిశారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నది. గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలకు ఇంజినీరింగ్ చదువు ఒక ఆశాకిరణం. ఫీజు రీయింబర్స్మెంట్ డోలాయమానంలో పడటంతో తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించాల్సి వస్తున్నది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ చదువులను కించపరచడం వారి విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా భావించాలి. వారికి దరఖాస్తు కూడా రాయడం రాదని అవమానించడం మరీ దారుణం. దీనికి బాధ్యత సర్కార్దే అనే విష యం మరిచిపోవడం విడ్డూరం. ఇక్కడే ప్రభు త్వ బాధ్యత మరింత పెరుగుతుంది. నాణ్యత లేని కాలేజీలను మూసివేయడం, నాణ్యత కలిగిన కాలేజీలను మెరుగుపరచడం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించడం, కొత్త సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ముఖ్యం. ఇవన్నీ తక్షణ చర్యలుగా చేపట్టాలి. తగిన ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా అత్యవసరం.