హనుమకొండ సబర్బన్, జూలై 3 : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. చిన్నచిన్న జల్లులే అక్కడక్కడా కురిశాయి. ప్రతి ఏటా కురవాల్సిన వర్షపాతం కంటే 69 శాతం లోటు వర్షపాతం నమోదై తీవ్ర కరువు సంకేతాలనిచ్చింది. హనుమకొండ జిల్లాలో సూమారు 12,300 ఎకరాల్లో మాత్రమే పత్తి విత్తనాలను రైతులు నాటగా, కొందరైతే కనీసం దుక్కులు కూడా దున్నలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు కురిసిన వర్షం పత్తి రైతులకు ఊరటనిచ్చేలా మారింది.
జిల్లాలో సాధారణ పత్తి సాగు 80వేల ఎకరాలు కాగా ఇప్పటికే రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ప్రస్తుత వర్షం భూమిలో వేడిని మొత్తం వెల్లిపోయో స్థాయిలో పడటంతో విత్తనాలను పూర్తి స్థాయిలో నాటుకునే అవకాశం ఉంది. జిల్లాలో సూమారు లక్ష నలభై వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా కాగా, ఇందుకు తగ్గుట్టుగా రైతులు నార్లు పోసుకున్నారు. అయితే పొలాలు దున్నాలంటే మాత్రం భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వరంగల్ నగరంలో వర్షానికి రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. హనుమకొండ, వరంగల్తో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.