నడికూడ, సెప్టెంబర్ 9 : రాజీయే రాజమార్గమని కక్షిదారులను ఉద్దేశించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాలినీలింగం అన్నారు. పరకాల పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కక్షలు పెంచుకుని నేరాలు చేయడంతో కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతారన్నారు. సమాజంలో మనవత్వం లేకుండా మనుషులను చంపడం, గుట్కా, గుడుంబా వంటి మత్తు పదార్థాలతో నేరాలకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు ఉంటాయని, వాటిపై ప్రజలు తెలుసుకుని పరివర్తన చెందాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా పలు మండలాలకు సంబంధించిన సివిల్, క్రిమినల్, బ్యాంకు కేసులు, కుటుంబ తగాదాలు మొత్తం 469 కేసులు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి, లోక్ అదాలత్ సభ్యులు శ్రావణ్, ఒంటేరు రాజమౌళి, న్యాయవాదులు రుథిర, కుమార్, పలు మండలాల పోలీసు అధికారులు, ఇతర న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.