జనగామ, జూలై 17 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. వానాకాలం మొదలై నెల రోజులు కావస్తున్నా ఒక్క గట్టివాన పడక భూగర్భ జలాలు పాతాళ లోతుకు పడిపోయాయి. చెరువులు, కుంటలు వట్టిపోతున్నాయి. బోర్లు కూడా ఆశించి నస్థాయిలో నీటిని అందివ్వకపోవడంతో వరి నారు మడులు ఎండిపోతుండగా, పత్తి మొలకలు వాడిపోతున్నాయి. తాగునీటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు దేవాదుల ఎత్తిపోతలపై ఆధారపడిన ఈ ప్రాంతానికి నీటి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో రైతన్నకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మరో వారం, పదిరోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే అన్నదాతలు పంటలు సాగు చేయని పరిస్థితులు నెలకొననున్నాయి.
వానాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో చినుకు జాడలేక రైతులు మొగులు వైపు దిగాలుగా చూస్తున్నారు. జిల్లాలోని దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి అదనులో నీరు చేరకపోవడంతో రోజురోజుకూ భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో సాగుతోపాటు తాగునీటి సమస్య తలెత్తుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ నిండుకుండలా మత్తళ్లు దూకే చెరువులు, కుంటల్లో నీటి జాడలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి.
బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులో ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు ఏకంగా 14.80 మీటర్ల లోతుకు పడిపోయింది. మొన్నటి వరకు పచ్చగా కళకళలాడిన నేలలు నెర్రెలు వారుతున్నాయి. జూన్ మొదటి, రెండో వారంలో వరి నార్లు పోసుకున్న రైతుల్లో కొందరు మాత్రమే నాట్లు వేసుకోగా, మిగిలిన వారు నారు వదిలేస్తున్నారు. జూన్ చివరి వారంలో నార్లు పోసుకున్న రైతుల పొలాలకు నీటి వసతి లేక, భారీ వర్షాలు పడకపోవడంతో దున్నకాల పనులు నిలిచాయి.
జనగామ జిల్లాకు మునుపటి కరువొచ్చింది. జిల్లాలో ఉన్న 7 దేవాదుల రిజర్వాయర్లుకుగాను బొమ్మకూరు, నవాబుపేట, ఆర్ఎస్ ఘన్పూర్, అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. గతంలో 90 శాతానికిపైగా గ్రామాల్లో నీటి వనరులన్నీ వీటి ద్వారానే నిండి పంటలకు సాగునీరందడం సహా భూగర్భ జల నీటిమట్టం పెరిగి బోర్లు వేసినా..బావులు తవ్వినా 80 నుంచి 100 ఫీట్ల లోపు నీటి జాడలు ఉబికివచ్చేవి. దేవరుప్పుల, కొడకండ్ల, జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, నర్మెట, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్ మండలాల్లో ఇప్పటికే వేసిన పత్తి విత్తనాలు భూమిలో మాడిపోగా.. మొలకెత్తిన పత్తి పంటను కాపాడుకునేందుకు బిందె, చెంబు సేద్యం కోసం వాటర్ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదుల నీటి ద్వారా కరువును జయించి అంచనాలకు మించి వరి సాగై ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన జనగామ ప్రాంతానికి మళ్లీ కరువుకాలం ముంచుకు వస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేసున్నది.