శాయంపేట, మే 25 : మండలంలోని ప్రగతిసింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం తనిఖీ చేశారు. ప్రగతి సింగారంలో ధాన్యం అధికంగా ఉండడంతో ఆరా తీశా రు. సెంటర్ నుంచి ట్యాగ్ అయిన రైతులు 370 మంది కాగా, కూపన్లు 82 మందికి ఇచ్చామని చెప్పడంతో ఇంత తక్కువేంటి అని అధికారులను ప్రశ్నించారు. రజినీకాంత్ అనే రైతు 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఇన్ని రోజులెందుకైందని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. అందరికీ టార్పాలిన్ షీట్లు ఇవ్వాలని సూచించారు. వానల వల్ల ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉన్నదని, మిల్లర్లతో మాట్లాడి తేమ ఎక్కువున్నా తీసుకునేలా చొరవ చూపాలని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాయంపేట మండలంలో ఇంకా కొంత కొనుగోళ్లు మిగిలి ఉన్నాయన్నారు. రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించాలన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మహిళా సంఘాలు అందిస్తున్న యూనిఫామ్స్ కుట్టు కేంద్రాన్ని తనిఖీ చేశారు. 1326 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ కుట్టాలని ఆర్డర్ ఇచ్చినట్లు మహిళలు కలెక్టర్కు తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి విజయభాస్కర్, ఎంపీడీవో ఫణిచంద్ర, తహసీల్దార్ సుభాషిణీ, ఏవో గంగాజమున, ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి, ఏఈవో అమ్మద్జ్రా పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా: రాజాజీనగర్ నుంచి బొకలగడ్డ వరకు ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా వెంటనే వాటిని తొలగించాలని, నయీంనగర్ నాలా నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నయీంనగర్ నాలా నిర్మాణ పనులపై అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నయీంనగర్ నాలా నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలు, ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న వర్షకాలం దృష్ట్యా వరద ప్రభావంతో నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా నయీంనగర్ నా లా నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నా రు. ఆర్డీవో వెంకటేశ్, రాజయ్య పాల్గొన్నారు.