మన ఊరు – మన బడి కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సకల సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. జిల్లాలో 898 పాఠశాలలుండగా, మొదటి విడుతలో 316 పాఠశాలలను ఎంపిక చేసి నిధులు కేటాయించి, పనులు ప్రారంభించారు. కాగా, వీటిలో మండలానికి రెండు పాఠశాలల చొప్పున జిల్లాలో 32 ఎంపిక చేసి ఆదర్శ పాఠశాలలుగా ప్రకటించారు. వీటిలో మొదట పనులు పూర్తి చేయించి, వీటి నమూనాతో జిల్లాలోని మిగిలిన స్కూళ్లలో పనులు చేయించనున్నారు. ఈ 32 ఆదర్శ పాఠశాలల్లో దాదాపు పనులు పూర్తయి అద్దంలా మెరుస్తున్నాయి. వీటితోపాటు మిగిలిన స్కూళ్లలో కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనుల పురోగతిపై కలెక్టర్ శశాంక ఎంఈవోలు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
నెల్లికుదురు, జనవరి 27 : తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యరంగానికి పెద్దపీట వేసింది. గత పాలకులెవ్వరూ కేటాయించనంత బడ్జెట్ను విద్యాశాఖకు వెచ్చించి, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ప్రైవేట్కు పరుగులు పెడుతున్న విద్యార్థులను సర్కారు స్కూళ్ల వైపు మళ్లించేందుకు సకల సౌకర్యాలతో బడులను తీర్చిదిద్దుతున్నది. నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడితో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. జిల్లాలో 898 పాఠశాలలుండగా, 198 ప్రాథమిక పాఠశాలలు, 42 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలు మొత్తం 316 పాఠశాలలను మొదటి విడుతలో ఎంపిక చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు చేయిస్తున్నారు.
వీటిలో మండలానికో రెండు పాఠశాలలను ఎంపిక చేసి ఆదర్శ పాఠశాలలుగా ప్రకటించి మొదటగా పనులను పూర్తి చేయిస్తున్నారు. దాదాపుగా పనులు పూర్తయ్యాయి. అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూల్స్లో డైనింగ్హాల్, ప్రహరీ, విద్యుత్ పనులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వంటశాల, మేజర్, మైనర్ పనులను ఏకకాలంలో శరవేగంగా పూర్తి చేయించారు. గోడలకు పుట్టితో కూడిన పెయింటింగ్ వేయించడంతో అద్దంలా మెరుస్తున్నాయి. 32 ఆదర్శ పాఠశాలల్లో పనులు పూర్త యి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో కూడా అభివృద్ధి పనులు దాదాపుగా తదుది దశకు చేరాయి. కొన్ని పాఠశాలల్లో 100 శాతం పూర్తయ్యాయి. కాగా, ఈ నెల 30న మన ఊరు- మన బడి పనులు ముగిసిన పాఠశాలలను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, నిరంతర పర్యవేక్షణ కారణంగా పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తవుతున్నాయి. ప్రభత్వ నిబంధనల మేరకు పనులన్నీ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. కలెక్టర్ అన్ని శాఖ అధికారులతో 15 రోజులకోసారి సమీక్షలు నిర్వహిస్తూ, పనుల్లో ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో గుర్తించి, అక్కడ పరిష్కరించారు. ఈ నెల 23న మండల విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నేమ్ బోర్డులు, ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.