గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర సర్కారు ఊరికో ఆటస్థలాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు నందన వనాలుగా రూపుదిద్దుకోగా, గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేయనున్న క్రీడాప్రాంగణాలతో సందడిగా మారనున్నాయి. అన్ని సౌకర్యాలతో ఎకరం నుంచి ఐదెకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 483 క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటికే 122చోట్ల స్థలాలను గుర్తించి పనులు కూడా మొదలుపెట్టారు. జూన్ మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో క్రీడాప్రాంగణానికి రూ.4లక్షల నుంచి రూ.9లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.
జనగామ రూరల్, మే 28 : పల్లెలకు పట్టణ శోభను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పటికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా, తాజాగా క్రీడా ప్రాంగణాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ యువజనుల నుంచి వృద్ధుల వరకూ గ్రామాల్లోనూ ఆట స్థలాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలతో పాటు ఆవాసాలను కలుపుకుని 483 చోట్ల క్రీడా మైదానాలు ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు స్థలం గుర్తించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 122 స్థలాల గుర్తించి వాటి పనులను జిల్లా గ్రామీణాభివృద్ది శాఖకు అప్పగించారు. ఎకరంలో క్రీడా మైదానం ఏర్పాటుకు రూ.4 లక్షల నుండి రూ.9 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎక్కువ స్థలం ఉంటే ఖర్చు మరింత కానుంది.
క్రీడా మైదానాల కోసం స్థలాల పరిశీలన
సమైక్య పాలనలో సాగునీటి సమస్యతో వేలాది ఎకరాలు బీడుగా ఉండేవి. పోరాడి సాధించుకున్న రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో బీడుభూములు సస్యశ్యామలమయ్యాయి. దీంతో క్రీడా మైదానాలకు స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొద్ది రోజులుగా అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. జూన్ 2 నుంచి 18వ తేదీ వరకు పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో అప్పటిలోగా మెజార్టీ క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆట స్థలాలతో క్రీడాకారులకు మేలు
క్రీడలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. కబడ్డీ కోర్టుతో పాటు ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. వ్యాయామంతోపాటు లాంగ్ బార్ సింగల్, డబుల్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
జూన్లో క్రీడాస్థలాల ఎంపిక పూర్తి చేస్తాం..
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అదేశించడంతో ప్ర స్తుతం ఆయా గ్రామాలతో పా టు ఆవాసాల్లో స్థలాలను పరిశీలిస్తున్నాం. జిల్లాలో 483 గ్రా మాలు, ఆవాసాలు ఉన్నాయి. వీటిలో 122 గ్రామాల్లో స్థలాలు గుర్తించగా పనులు జరుగుతున్నాయి. జూ న్ మొదటి వారంలో మిగిలిన స్థలాలు గుర్తిస్తాం. వెంటనే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం.
-జీ రంగాచారి, జిల్లా పంచాయతీ అధికారి
లింగాలఘనపురంలో క్రీడా ప్రాంగణానికి భూమిపూజ
లింగాలఘనపురం, మే 28 : మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న క్రీడాప్రాంగణానికి శనివారం సర్పంచ్ సాదం విజయమనోహర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్తోపాటు ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, ఉపసర్పంచ్ కేమిడి కవితావెంకటేశ్ మాట్లాడుతూ కళ్లెం గ్రామానికి వెళ్లే దారిలో సర్వే నంబరు 937లోని భూమిని క్రీడాప్రాంగణానికి తహసీల్ద్దార్ అంజయ్య కేటాయించారని తెలిపారు. క్రీడా ప్రాంగణం పనులు వేగవం తం చేస్తామని వారు వివరించారు. పట్టణాల కు దీటుగా పల్లెలను అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, ఈసీ వెంకటేశ్వర్లు, కారోబార్ బోయిని సురేశ్కుమార్, మాజీ సర్పంచ్ కేమిడి సాయిమల్లయ్య, నాయకులు బెజ్జం అంజనేయులు, బుట్రెడ్డి రాజారెడ్డి, లీడర్ యాదగిరి, అటెండర్ ఎండీ గౌస్మియా పాల్గొన్నారు.