ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 18 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టారీతిన వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము వెళ్లిందే టైం.. అన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటిపూట బడులు, మరోవైపు ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఎవరు పట్టించుకుంటారనే ధోరణిలో ఇలా వేళాపాళా లేకుండా పాఠశాలలకు వెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం 7.50 నిమిషాలకు పాఠశాలకు హాజరుకావాల్సిన ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు కూడా పూర్తిస్థాయిలో రాలేని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పాఠశాలల్లో సమ్మెటివ్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో కూడా సకాలంలో పాఠశాలలకు రావట్లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నగరంలోని పాఠశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం ఉదయం పాఠశాలకు వస్తుండగా.. మరికొందరు మాత్రం ఇష్టారీతిన వస్తున్నారు. దీనిపై కొందరు హెచ్ఎంలతోపాటు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బాధ్యులు ప్రశ్నించడంతో ఒకరిపై మరొకరు ఇష్టారీతిన వాగ్వాదానికి దిగుతూ ఆరోపణలు చేసుకుంటున్న సంఘటనలున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నిత్యం కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటనలు చేస్తుంటారు. ఇలాంటి ప్రధాన కూడళ్లలోని పాఠశాలల్లో సైతం సమయపాలన కొరవడిందంటే విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో స్పష్టమవుతోంది. కొన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఒకరోజు ఒకరు ముందుగా, మరో రోజు ఇంకొకరు ముందుగా వచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని పాఠశాలలకు వస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయానికి పాఠశాలకు హాజరుకావాలి. సమయపాలన పాటించకపోతే ఆయా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. ఎంఈవోలు పాఠశాలలను పర్యవేక్షించేలా ఆదేశిస్తాం. సమ్మెటివ్ పరీక్షలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులు ఉదయం 7.50 గంటలకు పాఠశాలలకు వెళ్లాల్సిందే.