మడికొండ, మే 3 : రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో కోటి ఎగరాలకు సాగునీరు అందించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.
వ్యవసాయ అధికారుల నియామకం, నకిలీ విత్తనాలను అరికట్టడం, రైతు వేదికల నిర్మాణం, ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు కరెంటు కోతలు ఉంటే తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు అందుతోందన్నారు. రైతన్న ఆనందంగా ఉండడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో బీడు భూములను సస్యశ్యామలం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ కిరణ్కుమార్, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, సంకు నర్సింగ్, ఇండ్ల నాగేశ్వర్రావు, ఏవో శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, రైతులు పాల్గొన్నారు.