నయీంనగర్, మార్చి19 : వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు పూజలు చేశారు. ఈ సందర్బంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణాన్ని కేంద్రం పట్టించుకోవడం లేని చెప్పారు. ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోనే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు అనుమతి ఉండదని అన్నారు.
పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2005లో ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఆలయ ఆవరణలోని విశాలమైన మండపాన్ని పూర్తిగా తొలగించి, మళ్లీ నిర్మించే పనులను కేంద్ర పురావస్తు శాఖ చేపట్టిందని అన్నారు. ఆలయం, మండపం పునరుద్ధరణ కోసం 2006లో రూ.3.50 కోట్లను మంజూరు చేసిందని, 2009లోపు ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2010 ఫిబ్రవరి 3న పనులు మొదలయ్యాయని తెలిపారు. 50 మందితో కూడిన తమిళనాడుకు చెందిన స్థపతి బృందం కల్యాణ మండపంలోని రాతి నిర్మాణాలను తొలగించిందని, అప్పటికే 132 పిల్లర్లు, 160 బీంలు విరిగిపోయి ఉన్నాయని చెప్పారు.
వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని, కొత్తగా శిలలు, వాటిపై శిల్పాలను చెకారని అన్నారు. ముందుగా పనులు ఆలస్యం కావడంతో అంచనా విలువ పెరిగిందని, 2012లో ఈ పనుల విలువ రూ.7.50 కోట్లకు పెరిగిందని అన్నారు. నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో స్థపతి బృందానికి బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని, బిల్లులు రాకపోవడంతో స్తపతి పలుసార్లు కేంద్ర పురావస్తు శాఖను కోరారని వివరించారు. అయినా పరిస్థితి మారకపోవడంతో పనులను వదిలేసి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2018లో నిధులను విడుదల చేసిందని, ఈ నిధులు గతంలో చేసిన పనులకు చెల్లించారని అన్నారు. పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసేందుకు మరో రూ.6 కోట్లు అవసరమవుతాయని కేంద్ర పురావస్తు శాఖ రెండేండ్ల క్రితం అంచనా వేసిందని తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ వెలుపల మౌలిక వసతులు కల్పించిందని చీఫ్ విప్ తెలిపారు. రూ.20 కోట్లతో గుడి ప్రధాన ద్వారం నుంచి వరంగల్-హనుమకొండ ప్రధాన రహదారికి మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదుట రూ.కోటితో సుందరీకరణ చేసినట్లు వివరించారు. చుట్టుపకల స్థలాలను సేకరించి పారింగ్ కోసం, పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉన్నా వేయి స్తంభాల ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తికాలేదని చీఫ్ విప్ పేర్కొన్నారు. డిసెంబర్లో పనులు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆలయ పునర్నిరాణానికి చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు దేవాలయాలను విస్మరించారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. యాదాద్రి లక్ష్మి నర్సింహస్వామి దేవాలయమే ఇందుకు నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం, కొండగట్టు, బాసర, భద్రాచలం దేవాలయాలకు నిధులు కేటాయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న వేయి స్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ కోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం బాధకరమని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని, రామప్పకు నిధులు కేటాయించడంలో కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.
ఉగాది వేడుకలు, ఇతర కార్యక్రమాలు వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించేందుకు రూ.25 వేలు కట్టాలని కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ జీవో జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. భక్తుల వద్ద భిక్షమెత్తి పురావస్తుశాఖకు కడుతామని చెప్పారు. 50 సంవత్సరాలుగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రం తీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇలాంటి జీవోను వెంటనే రద్దు చేయాలని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చీకటి ఆనంద్, ఆలయ ఈవో వెంకటయ్య, కుడా అధికారులు అజిత్, భీంరావు, ఆలయ ప్రధానార్చకుడు ఉపేంద్రశర్మ, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, మేకల బాబురావు, సుగుణాకర్రెడ్డి పాల్గొన్నారు.